టీమిండియా స్టార్ తిలక్ వర్మకు భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. శ్రీలంక- ‘ఎ’, అఫ్గానిస్తాన్- ‘ఎ’ జట్లతో ముక్కోణపు వన్డే సిరీస్లో ఈ హైదరాబాదీ స్టార్ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. అయినప్పటికీ కొంతమంది తిలక్ వర్మను విమర్శించడం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు.
భారత్దే టైటిల్
కాగా తిలక్ వర్మ సారథ్యంలో భారత్- ‘ఎ’ జట్టు ఇటీవల శ్రీలంకలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ అనధికారిక వన్డే సిరీస్లో అఫ్గాన్, శ్రీలంకపై పైచేయి సాధించిన భారత జట్టు.. ఫైనల్లోనూ లంకను చిత్తు చేసి టైటిల్ గెలుచుకుంది.
ఈ సిరీస్లో తిలక్ వర్మ నాలుగు అర్ధ శతకాల సాయంతో 275 పరుగులు సాధించాడు. తద్వారా భారత్- ‘ఎ’ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. అతడి స్ట్రైక్రేటు 74.93. ఇక శ్రీలంకతో ఫైనల్లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 324కు పైగా స్ట్రైక్రేటుతో (29 బంతుల్లో 94) విధ్వంసం సృష్టించగా.. నాలుగో స్థానంలో ఆడిన తిలక్ వర్మ కాస్త నెమ్మదిగానే ఆడాడు.
వైభవ్ అలా.. తిలక్ ఇలా
ఈ మ్యాచ్లో తిలక్ 74 స్ట్రైక్రేటుతో (90 బంతుల్లో) 67 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వైభవ్ను ప్రశంసిస్తూ.. తిలక్ ఆట తీరుపై కొద్దిమంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ఈ విషయంపై అశ్విన్ తాజాగా స్పందించాడు. ‘‘కొంతమంది కామెంట్ల రూపంలో తిలక్ వర్మ స్ట్రైక్రేటును విమర్శించడం నా కంటపడింది.
అవును నిజమే.. అయితే ఏంటి?
నిజమే అతడు కాస్త నెమ్మదిగానే ఆడాడు. అయినా సరే ఇంత ద్వేషం ఎందుకో అర్థం కావడం లేదు. వైభవ్ సూర్యవంశీ వేగంగా ఆడుతూ ఉంటే.. మరో ఎండ్లో తిలక్ వర్మ అతడిని కాంప్లిమెంట్ చేస్తూ.. అతడు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు’’ అని అశ్విన్.. తిలక్ వర్మకు మద్దతుగా నిలిచాడు.
చదవండి: టీమిండియాలోకి డేంజరస్ ప్లేయర్!


