
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya ) ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో భారత బౌలర్గా పాండ్యా రికార్డులకెక్కాడు. బుధవారం కోల్కతా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు పడగొట్టిన హార్దిక్.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హార్దిక్ ఇప్పటివరకు 111 మ్యాచ్లు ఆడి 91 వికెట్లు పడగొట్టాడు.
ఈ క్రమంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లను హార్దిక్ అధిగమించాడు. బుమ్రా 70 మ్యాచ్ల్లో 89 వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ 87 మ్యాచ్ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ అగ్రస్ధానంలో ఉన్నాడు.
అర్ష్దీప్ 61 మ్యాచ్ల్లో 97 వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సైతం ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. అర్ష్దీప్ తర్వాత స్ధానంలో స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(96) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పర్యాటక ఇంగ్లండ్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్లతో 79 పరుగులు చేసి భారత్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరగనుంది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా