బుమ్రాను అందుకు నువ్వే ఒప్పించాలమ్మా!.. పుజారా రిక్వెస్ట్‌ | Gavaskar Pujara ask Sanjana to convince Bumrah to play all 5 Tests Vs Eng | Sakshi
Sakshi News home page

సంజనా.. బుమ్రాను నువ్వే అందుకు ఒప్పించాలి: గావస్కర్‌, పుజారా

Jun 23 2025 4:26 PM | Updated on Jun 23 2025 5:34 PM

Gavaskar Pujara ask Sanjana to convince Bumrah to play all 5 Tests Vs Eng

ఇంగ్లండ్‌ పర్యటనను టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ఘనంగా ఆరంభించాడు. ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చి.. భారత్‌కు స్వల్ప ఆధిక్యం అందించాడు. బౌలింగ్‌ దళ భారాన్ని మొత్తం తానే మోస్తూ.. మరోసారి తన విలువను చాటుకున్నాడు.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్‌ క్రాలే (4), బెన్‌ డకెట్‌ (4).. అదే విధంగా మరో ప్రధాన బ్యాటర్‌ జో రూట్‌ (28) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చిన బుమ్రా.. క్రిస్ వోక్స్‌ (38), బ్రైడన్‌ కార్స్‌ (22) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇదిలా ఉంటే.. టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ (Ajit Agarkar) స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

అందుకే కెప్టెన్సీకి కూడా దూరం 
అంతేకాదు.. తాను కూడా అన్ని టెస్టులు ఆడలేను కాబట్టే కెప్టెన్సీ వద్దని చెప్పానని బుమ్రా కూడా ఇటీవల పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్‌తో ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసిన తర్వాత కూడా భవిష్యత్‌ దృష్ట్యా తాను పనిభారాన్ని మేనేజ్‌ చేసుకునే విషయంలో ‘స్మార్ట్‌’గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌, వెటరన్‌ బ్యాటర్‌ ఛతేశ్వర్‌ పుజారా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లోనూ బుమ్రా ఆడాలని కోరుకున్న ఈ ఇద్దరు క్రికెటర్లు.. ఇందుకు అతడిని ఒప్పించాలంటూ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ను కోరారు. ఆమె మరెవరో కాదు బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌.

సంజనా.. నాదో రిక్వెస్ట్‌..
భారత్‌- ఇంగ్లండ్‌ టెస్టుల బ్రాడ్‌కాస్టర్‌ సోనీ నెట్‌వర్క్‌ షోలో భాగంగా.. ‘‘సంజనా.. నాదో రిక్వెస్ట్‌.. అన్ని మ్యాచ్‌లు ఆడేలా జస్‌ప్రీత్‌ను నువ్వు మాత్రమే ఒప్పించగలవు. ఒక్కసారి ప్రయత్నించి చూడు. నీకు మాత్రమే అది సాధ్యం’’ అని పుజారా సంజనాతో అన్నాడు.

ఇంతలో గావస్కర్‌ కలుగజేసుకుంటూ.. ‘‘మ్యాచ్‌కి మ్యాచ్‌కి మధ్య కావాల్సినంత విరామం దొరుకుతుంది. దాదాపు ఎనిమిది రోజులు విశ్రాంతి లభిస్తుంది. తదుపరి మ్యాచ్‌కు వారానికి పైగా సమయం ఉంది. ఆ తర్వాత లార్డ్స్‌ టెస్టుకు.. ఆపై మాంచెస్టర్‌ టెస్టుకు కూడా ఇదే తరహాలో విరామం లభిస్తుంది.

జట్టుకు బుమ్రా అవసరం ఉంది
మాంచెస్టర్‌లో ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై, ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబర్‌ లేదంటే నవంబరు.. ఎప్పుడైనా బంతి బాగా స్వింగ్‌ అవుతుంది. ది ఓవల్‌లో ఐదు రోజులు మ్యాచ్‌ జరిగే అవకాశం ఉంటుంది.

జట్టుకు జస్‌ప్రీత్‌ అవసరం ఎంతగానో ఉంది. అతడు ఐదు టెస్టులు ఆడాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి నువ్వు అన్ని మ్యాచ్‌లు ఆడు బుమ్రా’’ అని సంజనా సమక్షంలో విజ్ఞప్తి చేశాడు. కాగా లీడ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌ 465 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్‌.. నాలుగో రోజు ఆటలో భాగంగా 34 ఓవర్ల ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు బాదిన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (4), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (8) ఈసారి విఫలమయ్యారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ 30 పరుగులు చేయగా.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 52, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ షెడ్యూల్‌
తొలి టెస్టు: జూన్‌ 20-24, లీడ్స్‌
రెండో టెస్టు: జూలై 2-6, బర్మింగ్‌హామ్‌
మూడో టెస్టు: జూలై 10- 14, లార్డ్స్‌, లండన్‌
నాలుగో టెస్టు: జూలై 23-27, మాంచెస్టర్‌
ఐదో టెస్టు: జూలై 31- ఆగష్టు 4, కెన్నింగ్‌టన్‌ ఓవల్‌, లండన్‌.

చదవండి: పృథ్వీ షా సంచలన నిర్ణయం.. ఇ​క గుడ్‌ బై?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement