
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. అద్భుత నైపుణ్యాలు జెస్సీ సొంతమని.. బ్యాటింగ్ లెజెండ్స్ సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి (Virat Kohli)లతో సరిసమాన గౌరవానికి అతడు అర్హుడని పేర్కొన్నాడు. బుమ్రా తన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడన్న అశూ.. అందరికంటే తానే వీరాభిమానినని తెలిపాడు.
ఇంగ్లండ్ పర్యటనలో
కాగా ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బుమ్రా.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్నాడు. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో అతడు సత్తా చాటాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 24.4 ఓవర్ల బౌలింగ్లో 83 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఈ కుడిచేతివాటం పేసర్ స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది.
సమాన గౌరవం దక్కాలి
ఇదిలా ఉంటే.. గిల్ సేన మ్యాచ్ ఓడినా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో బుమ్రా ప్రదర్శన పట్ల మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తాను బుమ్రాకు వీరాభిమానినంటూ అశూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘టెండుల్కర్, కోహ్లి మాదిరే బుమ్రాకు సమాన గౌరవం దక్కాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సచిన్ టెండుల్కర్ల విషయంలో మనమేం చేశామో.. జెస్సీ విషయంలోనూ అదే చేయాలి. నిజానికి బౌలర్గా అతడికి అందరికంటే ఎక్కువ గౌరవమే దక్కాలి.
అతడి భార్య పోటీకి వస్తుందేమో!.. నేనే నంబర్ వన్
అతడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎంతో మంది అతడిని ప్రేమిస్తున్నారు. నేనైతే అతడి నంబర్ వన్ ఫ్యాన్ని. నాకు తెలిసి ఈ నంబర్ వన్ ఫ్యాన్ విషయంలో బుమ్రా భార్య నాతో పోటీకి వస్తుందేమో! కానీ నేను మాత్రం నేనే నంబర్ వన్ అని చెప్తా’’ అంటూ అశ్విన్ బుమ్రా పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు.
కాగా బుమ్రా సతీమణి సంజనా గణేషన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ అన్న విషయం తెలిసిందే. ఐసీసీ ఈవెంట్లతో పాటు ఐపీఎల్లోనూ వ్యాఖ్యాతగా సత్తా చాటుతోందామె. ఈ జంటకు కుమారుడు అంగద్ బుమ్రా ఉన్నాడు.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకబడి ఉన్న టీమిండియా.. జూలై 2-6 వరకు రెండో టెస్టు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్లో బుమ్రా ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. పనిభారం తగ్గించే నిమిత్తం యాజమాన్యం అతడికి రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చినట్లు సమాచారం.
చదవండి: సచిన్ సర్ కొడుకు.. అర్జున్పై ఎలా అరవగలను?.. కెప్టెన్గా ఉన్నపుడు జరిగిందిదే!