
భారత క్రికెటర్లు పృథ్వీ షా (Prithvi Shaw), అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) ఒకే ఈడు వాళ్లు. ముంబైకి చెందిన ఈ ఇద్దరు కుర్రాళ్లు పాఠశాల స్థాయి నుంచి కలిసే క్రికెట్ ఆడారు. అలా ఇద్దరి మధ్య బాల్యస్నేహం ఉంది. పృథ్వీ షా కెప్టెన్సీలో అర్జున్ అండర్-13, అండర్-14 క్రికెట్ ఆడాడు. దేశీ క్రికెట్లో అర్జున్ 2022లో గోవాకు మారేంత వరకు కూడా ఇద్దరూ కలిసి ముంబైకి ప్రాతినిథ్యం వహించారు.
అయితే, టీనేజ్లో ఎంఐజీ క్లబ్ కెప్టెన్గా ఉన్న సమయంలో.. ఆటగాడైన అర్జున్ టెండుల్కర్ విషయంలో ఎలా స్పందించాలో పృథ్వీకి అర్థంకాకపోయేదట. క్యాచ్లు జారవిడిచినపుడు, మిస్ ఫీల్డింగ్ చేసినప్పుడు ఒకవేళ తనపై అరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని కాస్త భయపడేవాడట కూడా!..
అందుకు రెండు కారణాలు ఒకటి అర్జున్ తన స్నేహితుడు కావడం. మరొకటి ప్రపంచ క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన సచిన్ టెండుల్కర్ అర్జున్ తండ్రి కావడం.
సచిన్ సర్ కొడుకు.. అర్జున్పై ఎలా అరవగలను?
ఈ విషయాన్ని పృథ్వీ షా స్వయంగా వెల్లడించాడు. ‘‘అప్పట్లో అర్జున్ కూడా ఎంఐజీ క్లబ్ టీమ్కు ఆడేవాడు. నేను ఆ జట్టుకు కెప్టెన్ని. అక్కడే సమస్య మొదలైంది. సారథిగా నేను ఫీల్డ్ సెట్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ అతడు క్యాచ్ డ్రాప్ చేసినా.. ఇంకేదైనా పొరపాటు చేసినా అరవాల్సి ఉంటుంది. కానీ.. నేను అర్జున్పై ఎలా అరవగలను?.. తను నా ఫ్రెండ్. అన్నింటికీ మించి అతడు సచిన్ సర్ వాళ్ల అబ్బాయి. నేనిలా తికమకపడుతున్న వేళ సచిన్ సర్ నాకు ఓ మాట చెప్పారు.
నిర్మొహమాటంగా చెప్పెయ్
‘ఆట విషయంలో ఇలాంటి సందేహాలు వద్దు. నువ్వేదైనా అతడికి చెప్పాలనుకుంటే నిర్మొహమాటంగా చెప్పెయ్’ అని అన్నారు. అర్జున్ క్రికెట్ జీవితంలో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు’’ అని పృథ్వీ షా న్యూస్24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
అదే విధంగా.. ఆట పట్ల అర్జున్కు అంకిత భావం ఉండేదని.. తాను సచిన్ కుమారుడినని ఎప్పుడూ పొగరు చూపించేవాడు కాదంటూ 25 ఏళ్ల పృథ్వీ షా అర్జున్ను ప్రశంసించాడు. అర్జున్ ఎంతో నిరాడంబరంగా ఉండేవాడని.. తనలోని గొప్ప గుణం ఇదేనంటూ కొనియాడాడు.
మెరుపులా వచ్చి..
కాగా యుక్త వయస్సులోనే అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్న పృథ్వీ షా.. ఆటలో సచిన్ టెండుల్కర్ స్థాయికి చేరతాడంటూ ప్రశంసలు అందుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే టీమిండియా ఓపెనర్గా అరంగేట్రంలోనే అదరగొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
క్రమశిక్షణా రాహిత్యానికి తోడు ఫిట్నెస్ సమస్యల కారణంగా చాలా ఏళ్లుగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలే ముంబై జట్టును వీడిన పృథ్వీ.. వచ్చే దేశవాళీ క్రికెట్ సీజన్లో మహారాష్ట్రకు ఆడేందుకు సిద్ధమయ్యాడు.
చదవండి: ధావన్పై మండిపడ్డ రోహిత్ శర్మ.. షాకింగ్ విషయం బయటపెట్టిన గబ్బర్