
టీమిండియా ఓపెనర్, ముంబై స్టార్ ప్లేయర్ పృథ్వీ షా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఇకపై ముంబైకి ఆడకూడదని పృథ్వీ షా నిశ్చయించుకున్నాడు. వేరే జట్టుకు మారేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)ను అతడు అభ్యర్ధించాడు.
ఈ విషయాన్నిఎంసీఎ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. "పృథ్వీ షా.. ఎంసీఎ నుంచి నుంచి ఎన్వోసీ కోరాడు. మేము త్వరలో దానిపై నిర్ణయం తీసుకుంటాము" అని సదరు అధికారి ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నారు.
కాగా కెరీర్ ఆరంభంలో జూనియర్ సచిన్ టెండూల్కర్ పేరొందిన పృథ్వీ షా.. ఆ తర్వాత పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. భారత జట్టుకు దూరంగా ఉన్నప్పటికి దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో భాగమయ్యేవాడు. ఈ సారి ఐపీఎల్లో ఆడే అవకాశం కూడా అతడికి రాలేదు.
ఎంసీఎతో విభేదాలు..
కాగా గత కొంత కాలం నుంచి ముంబై క్రికెట్ అసోసియేషన్తో అతడికి విబేధాలు తలెత్తాయి. అందుకు ప్రధాన కారణం అతడిని జట్టు నుంచి తప్పించడమే. ఫిట్నెస్ సరిగా లేకపోవడంతో గతేడాది రంజీ ట్రోఫీ జట్టు నుంచి అతడిని ముంబై సెలక్టర్లు పక్కన పెట్టారు. షా శరీరంలో అధికంగా ఫ్యాట్ ఉందని, బరువు ఎక్కువగా ఉన్నాడని ముంబై టీమ్ మెనెజ్మెంట్ సెలక్టర్లకు ఫిర్యాదు చేసింది.
టీమ్ మెనెజ్మెంట్ ఫిర్యాదు మెరకు అతడికి రెండు వారాల ప్రత్యేక ఫిట్నెస్ ప్రోగ్రామ్ను ఎంసీఎ సిఫార్సు చేసింది. కానీ సెలక్టర్లు ఆశించినంత ఫిట్నెస్ను షా సాధించలేకపోయాడు. దీంతో గతేడాది డిసెంబర్లో జరిగిన విజయ్ హాజారే ట్రోఫీలో కూడా షా భాగం కాలేదు.
ఈ క్రమంలోనే ఎంసీఎతో పృథ్వీషా తెగదింపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పృథ్వీ షా ఇప్పటివరకు ముంబై జట్టు తరపున 58 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 4556 పరుగులు చేశాడు. అదేవిధంగా 65 లిస్ట్-ఎ, 117 టీ20ల్లో ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు.
చదవండి: IND vs ENG: రెచ్చగొట్టిన మహ్మద్ సిరాజ్.. ఇచ్చిపడేసిన ఇంగ్లండ్ బ్యాటర్! వీడియో