చారిత్రక విజయానికి అడుగు దూరంలో టీమిండియా | Indian womens team close to historic win against england in Lords Test | Sakshi
Sakshi News home page

చారిత్రక విజయానికి అడుగు దూరంలో టీమిండియా

Jul 12 2026 11:19 PM | Updated on Jul 12 2026 11:19 PM

Indian womens team close to historic win against england in Lords Test

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు చారిత్రక విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌ను 341/7 వద్ద డిక్లేర్ చేసిన భారత్, ఇంగ్లండ్‌కు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 

ఈ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడికి లోనై 130 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది (మూడో రోజు ఆట ముగిసే సమయానికి). దీంతో భారత్‌ విజయానికి మరో నాలుగు వికెట్లు దూరంలో మాత్రమే ఉంది. చివరి రోజు ఆట మిగిలి ఉంది. ఇంగ్లండ్‌ ఇంకా 327 పరుగులు వెనుకపడి ఉంది. 

ఏమి జరిగినా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవడం అసాధ్యం. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్‌, స్నేహ్‌ రాణా కలిసి దెబ్బ కొట్టారు. వీరు ముగ్గురు తలో 2 వికెట్లు తీశారు. ఆట ముగిసే సమయానికి యామీ జోన్స్‌ (52), సోఫీ ఎక్లెస్టోన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.

అంతకుముందు యస్తిక భాటియా (113) సూపర్‌ సెంచరీతో, ఆఖర్లో రిచా ఘోష్‌ (50 నాటౌట్‌) మెరుపు అర్ద శతకంతో చెలరేగడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ చేసింది. స్మృతి మంధాన (70) అర్ద సెంచరీతో సత్తా చాటింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్‌ 5 వికెట్లతో రాణించింది.

దీనికి ముందు క్రాంతి గౌడ్‌ (17-7-37-5) ధాటికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్‌ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్‌ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ నాట్‌ సీవర్‌ ‍బ్రంట్‌ (44) ఓ మోస్తరు స్కోర్‌ చేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు.

కాగా, భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య లార్డ్స్‌లో జరుగతున్న తొలి మహిళల టెస్ట్‌ మ్యాచ్‌ ఇదే. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనత, సెంచరీ చేసి క్రాంతి గౌడ్‌, యస్తిక భాటియా  ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తమ పేర్లను చిరస్థాయిగా లిఖించుకున్నారు. లార్డ్స్‌లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గా క్రాంతి.. తొలి సెంచరీ చేసిన బ్యాటర్‌ యస్తిక రికార్డు సృష్టించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement