భారత క్రికెటర్ పృథ్వీ షా, అతని కాబోయే భార్య అకృతి అగర్వాల్ వీడిపోయారంటూ సోషల్మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అకృతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో "నన్ను చాలా సార్లు మోసం చేశారు" అని అర్థం వచ్చేలా ఒక క్రిప్టిక్ సందేశాన్ని పోస్ట్ చేసింది. ఆమె ఎక్కడా పృథ్వీ షా పేరు ప్రస్తావించకపోయినా, సోషల్ మీడియాలో చాలా మంది అది పృథ్వీని ఉద్దేశించిందేనని భావించారు.
అంతేకాకుండా ఆమె కొంతసేపు పృథ్వీని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసి మళ్లీ ఫాలో చేయడం.. మోసం, నమ్మకద్రోహం గురించి మరికొన్ని పోస్టులు పంచుకోవడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి.
అయితే ఈ వార్తలపై అకృతి తాజాగా స్పందిస్తూ.. "నేను ఎక్కడా నా కాబోయే భర్త పేరు చెప్పలేదు. మా నిశ్చితార్థం రద్దయిందని లేదా మేము విడిపోయామని కూడా ఎప్పుడూ చెప్పలేదు. దురదృష్టవశాత్తు చాలామంది ఆ పోస్టు అతనిని ఉద్దేశించిందేనని భావించారు. కానీ మేమిద్దరం ఇప్పటికీ కలిసి ఉన్నాం. మా ఎంగేజ్మెంట్ కొనసాగుతోంది. మా మధ్య ఎలాంటి సమస్య లేదు" అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వివరణ ఇచ్చింది.
అలాగే, "ఒక పబ్లిక్ ఫిగర్ ప్రతిష్ఠను కేవలం ఊహాగానాల ఆధారంగా ఎంత సులభంగా దెబ్బతీయవచ్చో ఈ ఘటనతో నాకు అర్థమైంది. ఎలాంటి పేర్లు లేకుండా చేసిన ఒక పోస్టు కూడా అసత్య ప్రచారానికి కారణమవుతుంది. నా భాగస్వామి గౌరవం దెబ్బతింటుండటాన్ని చూసి నేను ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది" అని వెల్లడించింది. దీంతో షా-అకృతి విడిపోయారనే ప్రచారానికి ఫుల్స్టాప్ పడింది.
కాగా, పృథ్వీ షా-అకృతి అగర్వాల్ మార్చి 8, 2026న తమ నిశ్చితార్థాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో షా ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ సీజన్లో అతడికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు.
అకృతి అగర్వాల్ సోషల్ మీడియాలో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు సుమారు 31 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్, లైఫ్స్టైల్, డ్యాన్స్కు సంబంధించిన కంటెంట్తో ఆమెకు మంచి గుర్తింపు ఉంది.
మరోవైపు పృథ్వీ షా గతంలో మైదానం వెలుపల కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాడు. 2023లో ముంబైలో సెల్ఫీ విషయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్తో జరిగిన ఘర్షణ వార్తల్లో నిలిచింది. అలాగే ఫిట్నెస్, క్రమశిక్షణ అంశాలపై విమర్శలు ఎదుర్కొన్నాడు. టెర్బుటాలిన్ పాజిటివ్గా తేలడంతో ఎనిమిది నెలల నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నాడు. ఆ పదార్థం దగ్గు సిరప్ వల్ల తన శరీరంలోకి వెళ్లిందని అప్పట్లో పృథ్వీ వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం పృథ్వీ షా కెరీర్ ఆశాజనకంగా సాగడం లేదు.


