ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్‌ హీరోల జట్టు: పాక్‌ మాజీ క్రికెటర్‌ | Former Pakistan star heaps huge praise after India thrash Bangladesh | Sakshi
Sakshi News home page

ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్‌ హీరోల జట్టు: పాక్‌ మాజీ క్రికెటర్‌

Oct 7 2024 3:09 PM | Updated on Oct 7 2024 4:20 PM

Former Pakistan star heaps huge praise after India thrash Bangladesh

గ్వాలియర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టీ20లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన భార‌త జ‌ట్టు.. బంగ్లాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బౌలింగ్‌లో ప్ర‌త్య‌ర్ధిని కేవ‌లం 127 ప‌రుగులకే క‌ట్ట‌డి చేసిన సూర్య సేన‌.. అనంత‌రం ల‌క్ష్యాన్ని కేవ‌లం 11.5 ఓవ‌ర్లలోనే ఊదిప‌డేసింది. ఈ నేప‌థ్యంలో యువ భార‌త జ‌ట్టుపై  పాక్‌ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

ఇది కేవలం భారత జట్టు కాదని, ఐపిఎల్ స్టార్లతో కూడిన జ‌ట్టు అని అలీ కొనియాడాడు. కాగా బంగ్లాతో సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, సూర్య‌కుమార్ మిన‌హా మిగితా సీనియ‌ర్ ఆట‌గాళ్లంతా దూర‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో అద‌ర‌గొట్టిన మ‌యాంక్ యాద‌వ్‌, నితీష్ కుమార్ రెడ్డి యువ ఆట‌గాళ్లకు బంగ్లాతో టీ20 సిరీస్‌కు సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. 

వీరితో పాటు గ‌త రెండు ఐపీఎల్ సీజ‌న్‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చక్ర‌వ‌ర్తికి కూడా మూడేళ్ల త‌ర్వాత భారత జ‌ట్టులో చోటు ద‌క్కింది. అయితే వీరు ముగ్గురూ త‌మ‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగ ప‌రుచుకున్నారు. వ‌రుణ్‌, మ‌యాంక్ బౌలింగ్‌లో అద‌ర‌గొట్ట‌గా.. నితీష్ బ్యాటింగ్‌లో 16 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌న్పించాడు.

"ఇది భార‌త్ టీమ్ కాదు, యువ‌కుల‌తో కూడిన ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌. ఈ సిరీస్‌కు య‌శ‌స్వీ జైశ్వాల్‌, గిల్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, రిష‌బ్ పంత్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల‌కు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా స్టార్ స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ కూడా తొలి టీ20లో ఆడ‌లేదు. అయిన‌ప్ప‌ట‌కి భార‌త్ 11.5 ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్ ముగించింది. హార్దిక్ సిక్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అస్స‌లు పాకిస్తాన్‌ను వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్ జ‌ట్టు ఇదేనా? 

భార‌త్‌పై టెస్టు సిరీస్‌లో ఘోర ఓట‌మిని చవిచూశారు. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే ఆట‌తీరును క‌న‌బ‌రుస్తున్నారు. భారత్ గ‌త కొంత కాలంగా వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో త‌మ ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తోంది. మ‌రోసారి బంగ్లా దేశ్ భార‌త్ ముందు త‌లొగ్గ‌క త‌ప్ప‌దు. మ‌రోవైపు మ‌యాంక్ యాద‌వ్ త‌న ప్ర‌ద‌ర్శ‌నతో ఆక‌ట్టుకున్నాడు.

తొలి ఓవ‌ర్‌నే మెయిడెన్‌గా మలిచాడు. 149.8 kmph వేగంతో బౌలింగ్ చేసి ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను భ‌య‌పెట్టాడు. అత‌డు 150 కి.మీ పైగా వేగంతో అత‌డు బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. కానీ అత‌డు ఇప్పుడే గాయం నుంచి కోలుకుని రావ‌డంతో ఆ దిశ‌గా ప్ర‌య‌త్నం చేయ‌లేదు. క‌చ్చితంగా అత‌డు బుమ్రా, ష‌మీ, సిరాజ్‌ల స‌ర‌స‌న చేరుతుడాని" త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో అలీ పేర్కొన్నాడు.
చదవండి: టీమిండియా అరుదైన ఘనత.. పాకిస్తాన్‌ వరల్డ్‌ రికార్డు సమం

Advertisement
 
Advertisement
Advertisement