
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ ఎంపిక చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది. రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. పలు నివేదికల ప్రకారం టెస్టు కెప్టెన్సీ రేసులో స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
అతడితో పాటు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా విన్పిస్తోంది. కానీ గిల్ తో పోలిస్తే బుమ్రాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గాయాల బెడద, వర్క్లోడ్ మేనేజ్మెంట్ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు జట్టు పగ్గాలు అప్పగించకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనుభవం లేని గిల్ వైపు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మొగ్గు చూపుతుండడం క్రికెట్ వర్గాల్లో అసంతృప్తికి దారితీసినట్లు తెలుస్తోంది.
చాలా మంది మాజీలు భారత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు గిల్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్గా బుమ్రా ఉండాలని, శుబ్మన్ గిల్ను అతడి డిప్యూటీగా ఎంపిక చేయాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
"భారత టెస్టు కెప్టెన్సీ రేసులో జస్ప్రీత్ బుమ్రా ముందంజలో ఉంటాడాని భావిస్తున్నాను. ఒకవేళ తనంతట తానుగా కెప్టెన్సీ ఆఫర్ తిరష్కరిస్తే తప్ప సెలక్టర్లు మరో ఆప్షన్ను పరిశీలించరు. అతడిని కెప్టెన్గా చేసి గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయాలి. బుమ్రాకు విశ్రాంతి అవసరమైనప్పుడల్లా గిల్ జట్టును నడిపిస్తున్నాడు. దీంతో గిల్కు పూర్తి స్ధాయి కెప్టెన్గా ఎదిగేందుకు తగినంత సమయం లభిస్తోంది" అని జాఫర్ ఎక్స్లో రాసుకొచ్చాడు.
కాగా గిల్కు కెప్టెన్గా అంతర్జాతీయ స్ధాయిలో పెద్దగా అనుభవం లేదు. జింబాబ్వే సిరీస్లో భారత జట్టు సారధిగా గిల్ వ్యవహరించాడు. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టును నడిపించలేదు. ఐపీఎల్ మాత్రం కెప్టెన్గా అతడికి అనుభవం ఉంది. గుజరాత్ టైటాన్స్ సారథిగా గిల్ కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.
చదవండి: BCCI - IND vs ENG: టీమిండియాలో అతడికి చోటు కష్టమే!