భారత్‌తో తొలి టెస్టు.. ఇంగ్లండ్‌ తుదిజట్టు ప్రకటన | ENG vs IND 1st Test: England Announce Playing XI No Jacob Bethell | Sakshi
Sakshi News home page

భారత్‌తో తొలి టెస్టు.. ఇంగ్లండ్‌ తుదిజట్టు ప్రకటన

Jun 18 2025 7:55 PM | Updated on Jun 18 2025 8:59 PM

ENG vs IND 1st Test: England Announce Playing XI No Jacob Bethell

టీమిండియా(Ind vs Eng 1st Test)తో తొలి టెస్టుకు ఇంగ్లండ్‌ తమ తుదిజట్టును ప్రకటించింది. జాక్‌ క్రాలేతో పాటు బెన్‌ డకెట్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించనుండగా.. మూడో స్థానంలో ఓలీ పోప్‌ బరిలోకి దిగనున్నాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో భారీ శతకం (171)తో విరుచుకుపడిన పోప్‌నకు సెలక్టర్లు మరో అవకాశం ఇవ్వగా.. జేకబ్‌ బెతెల్‌ (Jacob Bethell)కు నిరాశే మిగిలింది.

ఇక బెన్‌ స్టోక్స్‌ సారథ్యంలోని ఈ జట్టులో క్రిస్‌ వోక్స్‌కు స్థానం దక్కింది. డిసెంబరు తర్వాత అతడు ఇంగ్లండ్‌ తరఫున పునరాగమనం చేయనున్నాడు. ఇక దుర్హం సీమర్‌ బ్రైడన్‌ కార్సే కూడా భారత్‌తో తొలి టెస్టులో భాగం కానున్నాడు. సొంతగడ్డపై అతడికి ఇదే మొదటి టెస్టు కావడం విశేషం.

చివరగా అతడు పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లతో ఆయా దేశాల్లో జరిగిన సిరీస్‌లలో పాల్గొన్నాడు. మరోవైపు.. జేమీ స్మిత్‌ వికెట్‌ కీపర్‌గా కొనసాగనున్నాడు.

కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌ టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఇరుజట్లకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌లో ఇదే తొలి సిరీస్‌. శుక్రవారం (జూన్‌ 20) నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది.  లీడ్స్‌లోని హెడ్డింగ్లీ మైదానం ఇందుకు వేదిక.

టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్‌ తుదిజట్టు
జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌, జేమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), క్రిస్‌ వోక్స్‌, బ్రైడన్‌ కార్సే, జోష్‌ టంగ్‌, షోయబ్‌ బషీర్‌.

భారత్‌తో టెస్టులకు ఇంగ్లండ్‌ జట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్‌ బెతెల్‌, హ్యారీ బ్రూక్, బ్రైడన్‌ కార్సే, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్.

సిరీస్‌ పేరు అదే.. గెలిచిన కెప్టెన్‌కు పటౌడీ పతకం
టీమిండియా- ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ఇరు దేశాల దిగ్గజాలను గుర్తు చేసేలా టెండూల్కర్‌–అండర్సన్‌ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy) పేరు ఖరారైంది. ఇప్పటి వరకు ‘పటౌడీ ట్రోఫీ’గా ఉన్న పేరును మారుస్తున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) గతంలోనే ప్రకటించింది. దాంతో పటౌడీ పేరు తొలగించడంపై విమర్శలు వచ్చి చర్చ జరిగింది. కానీ ఈసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు.

తాము అనుకున్న పేరునే ఖాయం చేసింది. తొలి టెస్టుకు ముందు రోజు ఈ నెల 19న ఈ ట్రోఫీని ఆవిష్కరిస్తారు. అయితే పటౌడీని ఏదో ఒక రూపంలో గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలంటూ బీసీసీఐ చేసిన విజ్ఞప్తికి మాత్రం ఈసీబీ సానుకూలంగా స్పందించింది. టెస్టు సిరీస్‌లో విజేతగా నిలిచే కెప్టెన్‌కు ‘పటౌడీ మెడల్‌’ను అందజేస్తారు.

కాగా భారత అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న పటౌడీ ససెక్స్, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జట్ల తరఫున కూడా ఆడగా... ఆయన తండ్రి ఇఫ్తికార్‌ అలీఖాన్‌ పటౌడీ భారత్, ఇంగ్లండ్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. దాంతో వారి గౌరవార్ధం ఇప్పటి వరకు ‘పటౌడీ ట్రోఫీ’గా పిలిచారు. అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్లుగా సచిన్‌ టెండూ ల్కర్‌ (200), జేమ్స్‌ అండర్సన్‌ (188) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.  

చదవండి: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్‌ రహీం.. వరల్డ్‌ రికార్డు బద్దలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement