
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నమెంట్లో టీమ్ విభాగాల్లో భారత జట్లకు నిరాశ ఎదురైంది. కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో భారత బృందాలు పతకాలు గెల్చుకోవడంలో విఫలమయ్యాయి. మహిళల కాంపౌండ్ కాంస్య పతక మ్యాచ్లో వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర)లతో కూడిన భారత జట్టు 238–239తో అలెక్సిస్ రూయిజ్, ఒలీవియా డీన్, అబిగెయిల్లతో కూడిన అమెరికా జట్టు చేతిలో ఓడిపోయింది.
బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, పార్థ్లతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు కూడా కాంస్య పతక మ్యాచ్లో ఓడిపోయింది. భారత బృందం 1–5తో ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. అంకిత, దీపిక, సిమ్రన్జీత్లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు క్వార్టర్ ఫైనల్లో 1–5తో అమెరికా జట్టు చేతిలో ఓడిపోయింది.