మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో ధీరజ్‌–కుంకుమ్‌ జోడీ | Dheeraj and Kumkum pair in the mixed team final | Sakshi
Sakshi News home page

మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో ధీరజ్‌–కుంకుమ్‌ జోడీ

Jun 12 2026 5:21 AM | Updated on Jun 12 2026 5:22 AM

Dheeraj and Kumkum pair in the mixed team final

అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–3 టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి పతకం ఖరారైంది. రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో బొమ్మదేవర ధీరజ్‌ (ఆంధ్రప్రదేశ్‌)–కుంకుమ్‌ (మహారాష్ట్ర) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్‌కు పతకాన్ని అందించనుంది. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్‌ టీమ్‌ సెమీ ఫైనల్లో ధీరజ్‌–కుంకుమ్‌ జోడీ 6–2 (36–37, 39–37, 38–36, 38–37) సెట్‌ స్కోరుతో కత్రినా బాయెర్‌–మోరిట్జ్‌ వీసెర్‌ (జర్మనీ) జంటను ఓడించింది. 

తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్‌ ఆడిన ధీరజ్‌–కుంకుమ్‌ 6–0 (38–37, 37–35, 37–35) సెట్‌ స్కోరుతో క్రిస్టీన్‌–డాల్స్‌గార్డ్‌ (డెన్మార్క్‌)లపై, క్వార్టర్‌ ఫైనల్లో 6–2 (38–36, 36–37, 40–36, 40–36) సెట్‌ స్కోరుతో కేసీ కౌఫోల్డ్‌–నికోలస్‌ డామూర్‌ (అమెరికా)లపై గెలిచారు. 

ఆదివారం జరిగే ఫైనల్లో ఒ యెజిన్‌–కిమ్‌ జె డియోక్‌ (దక్షిణ కొరియా)లతో ధీరజ్‌–కుంకుమ్‌ తలపడతారు. మరోవైపు కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ–సాహిల్‌ (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్లో 154–156తో ఒడోనూస్‌ సవన్నా–కర్టిస్‌ బ్రాడ్‌నక్స్‌ (అమెరికా) జంట చేతిలో పరాజయం పాలైంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement