
ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 14) జరుగబోయే భారత్, పాకిస్తాన్ మ్యాచ్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి.
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఈ మ్యాచ్కు ససేమిరా అంటున్నాయి. మ్యాచ్ చూడకుండా టీవీలు ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
దేశవాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఈ మ్యాచ్ రద్దుకు పిలుపునిచ్చాయి. మ్యాచ్ ప్రారంభానికి మరికొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో మ్యాచ్ బహిష్కరణ పిలుపులు తారాస్థాయికి చేరాయి. సోషల్మీడియా #BoycottIndvsPak హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుత సందిగ్ద పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతోందో లేదోనని యావత్ క్రీడా ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది.
ఈ మ్యాచ్లో దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. మ్యాచ్ ప్రారంభానికి మరో 8 గంటలు ఉన్న నేపథ్యంలో ఏమైనా జరగవచ్చని (రద్దు) నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మెజార్జీ శాతం భారతీయులకు ఈ మ్యాచ్ జరగడం అస్సలు ఇష్టం లేదు.
కొందరు ఈ మ్యాచ్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే క్రికెట్ను రాజకీయాలతో ముడిపెట్టలేమని పలువురు వేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.
కాగా, ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆధారిత ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడ్డాయి. ఇందుకు భారత్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్లో తలదాచుకున్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. భారత్ కొట్టిన ఈ దెబ్బకు పాక్ విలవిలలాడిపోయింది.
అపరేషన్ సిందూర్ తర్వాత భారత్ ఏ విషయంలోనూ పాక్తో సంబంధాలు పెట్టుకోకూడదని నిర్ణయించుకుంది. ఇందుకు అంతర్జాతీయ వేదికలపై జరిగే మేజర్ క్రీడా పోటీలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఈ క్రమంలోనే భారత్ బహుళ దేశాలు పాల్గొంటున్న ఆసియా కప్లో పాక్తో మ్యాచ్కు సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్ రద్దుకు భారత్లో ఆందోళనలు ఉధృతమవడంతో సందిగ్దత నెలకొంది.