న్యూఢిల్లీ: రెండు ఒలింపిక్ పతకాల విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు. ఈ ఏడాది చోప్రా మాజీ టెన్నిస్ ప్లేయర్ హిమాని మోర్ను వివాహమాడాడు. సతీమణితో వెళ్లి ప్రధానితో కాసేపు ముచ్చటించాడు. చాంపియన్ అథ్లెట్తో భేటీని మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
‘నీరజ్, తన శ్రీమతి హిమానితో నన్ను కలుసుకోవడం నాకూ సంతోషాన్నిచ్చింది. ఈ సందర్భంగా చోప్రా, నేను క్రీడాంశాలపై చర్చించాం. ఇతర విషయాలపై కూడా ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది’ అని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 27 ఏళ్ల నీరజ్ చోప్రాకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు వచ్చాయి.
చాన్నాళ్లు ఫిట్నెస్ సమస్యలతోసతమతమైనప్పటికీ ఈ స్టార్ జావెలిన్ త్రోయర్ తాను ఆశించినట్లే 90 మీటర్ల మార్క్ను దోహా డైమండ్ లీగ్లో అధిగమించాడు. కానీ సెప్టెంబర్లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో మాత్రం టైటిల్ను నిలబెట్టుకోలేకపోయాడు. ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. హేమాహేమీలతో స్వయంగా తన పేరుతో నిర్వహించిన బెంగళూరు ఈవెంట్లో చోప్రానే విజేతగా నిలిచాడు.


