టీ20 ప్రపంచకప్ 2026 ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 7) ప్రారంభం కానుంది. ఇవాళే భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
కాగా, ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలిందని తెలుస్తుంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. బుమ్రా వైరల్ ఫీవర్ బారిన పడినట్లు తెలుస్తుంది. ఈ కారణంగా అతను శుక్రవారం నాటి నెట్ ప్రాక్టీస్కి హాజరుకాలేదు.
దీంతో నేటి మ్యాచ్కు బుమ్రా దూరమవుతాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే.. ప్రత్యర్ది (యూఎస్ఏ) చిన్నదే అయినా, ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు.
గత ప్రపంచకప్లో ఇదే జట్టు పాక్కు షాకిచ్చింది. కాబట్టి, బుమ్రా అందుబాటులో లేకపోయినా టీమిండియా మరో పేస్ బౌలింగ్ ఆప్షన్తో సిద్దంగా ఉండక తప్పదు.
ఒకవేళ బుమ్రా నిజంగా యూఎస్ఏ మ్యాచ్కు దూరమైతే కొత్తగా జట్టులోకి వచ్చిన సిరాజ్కు తుది జట్టులో అవకాశం ఉండవచ్చు. హార్దిక్ పాండ్యా కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించే అవకాశం ఉండగా, సిరాజ్ ఫస్ట్-చేంజ్ బౌలర్గా ఉపయోగపడతాడు.
యూఎస్ఏతో మ్యాచ్ తర్వాత భారత్ ఫిబ్రవరి 12న నమీబియాతో తలపడనుంది. ఆతర్వాత ఫిబ్రవరి 15న పాకిస్తాన్తో మ్యాచ్ షెడ్యూలైంది. అయితే ఈ మ్యాచ్పై అనిశ్చితి ఇంకా కొనసాగుతుంది. పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
పాక్ ఆడినా ఆడకపోయినా, భారత్ అయితే ఈ మ్యాచ్ కోసం కొలొలంబోకు వెళ్తుంది. ఒకవేళ పాక్ నిజంగా బరిలోకి దిగకపోతే భారత్కు మ్యాచ్ ఆడకుండానే పాయింట్లు లభిస్తాయి. దీని తర్వాత టీమిండియా ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్తో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడనుంది.
యూఎస్ఏతో మ్యాచ్కు భారత జట్టు (అంచనా)..
ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ సిరాజ్


