టీ20 ప్రపంచకప్-2026కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్లో కొలంబో వేదికగా పాకిస్తాన్-నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ జట్టుకు నెదర్లాండ్స్ సీనియర్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వాన్ మీకెరెన్ తాజాగా క్రిక్స్ అనే స్పోర్ట్స్ వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వాన్ మీకెరెన్కు పాక్తో మ్యాచ్ కోసం ఏమైనా ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నారా? అన్న ప్రశ్న ఎదురైంది.
"పాకిస్థాన్తో మ్యాచ్ను మేము ప్రత్యేకంగా చూడడం లేదు. ఇది కూడా మిగిలిన మ్యాచ్ల్లాగే. మా గ్రూపులో భారత్ వంటి బలమైన జట్టుతో పాటు అమెరికా, నమీబియా వంటి టీమ్స్ కూడా ఉన్నాయి. మా దృష్టి కేవలం పాక్ మ్యాచ్పైనే లేదు. టోర్నీ తొలి మ్యాచ్లో పాక్ ఓడించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం. 2009 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లో మేము సంచలన విజయం సాధించాము. ఇప్పుడే అదే ఫలితాన్ని పునరావృతం చేయాలన్న పట్టుదలతో ఉన్నాము" అని వాన్ మీకెరెన్ పేర్కొన్నాడు.
అదేవిధంగా పాక్ పేస్ బౌలింగ్ చూసి భయపడుతున్నారా? అన్న ప్రశ్నకు వాన్ మీకెరెన్ బదులిస్తూ: ఒకప్పుడు పాక్ బౌలర్లను చూసి భయపడేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్లో పాక్ జట్టుతో మ్యాచ్లు ఆడాము. పాక్ బలాలు, బలహీనతలపై మాకు ఒక అవగహన ఉందని చెప్పుకొచ్చాడు.
కాగా డచ్ జట్టుతో మ్యాచ్కు పాక్కు చాలా కీలకం. భారత్తో మ్యాచ్ను పాకిస్తాన్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్తో మ్యాచ్ పాయింట్లు కోల్పోనుండటంతో.. పాక్ తదుపరి రౌండ్కు వెళ్లాలంటే నెదర్లాండ్స్, అమెరికా, నమీబియాలతో జరిగే మిగిలిన మూడు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాల్సిందే.


