టీ20 వరల్డ్కప్-2026లో భారత క్రికెట్ జట్టు తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. టోర్నీ ఆరంభం రోజు(ఫిబ్రవరి 7)నే వాంఖడే వేదికగా అమెరికాతో టీమిండియా తలపడనుంది. అయితే భారత తుది జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్కు చోటు దక్కుతుందా? లేదా? అన్నది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చానీయాంశమైంది. సంజూ పేలవ ఫామ్ కనబరుస్తుండడంతో అతడి స్దానంలో ఓపెనర్గా ఇషాన్ కిషన్ పంపాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచించారు.
దీంతో టీమ్ మెనెజ్మెంట్ శాంసన్పై వేటు వేసేందుకు సిద్దమైందని వార్తలు వస్తున్నాయి. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లలో సంజూ ఆడకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. తాజాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వాఖ్యలు బట్టి సంజూకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు కష్టమే అన్పిస్తోంది.
శాంసన్ స్దానంలో సూపర్ ఫామ్లో ఉన్న కిషన్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించడం దాదాపు ఖాయమైనట్లే అన్పిస్తోంది. అమెరికాతో మ్యాచ్కు ముందు విలేకరుల సమావేశంలో సూర్య పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఇషాన్పై సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఓపెనర్గా ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కేవలం టీమిండియా తరపునే కాదు, దేశవాళీ క్రికెట్లో కూడా దుమ్ములేపాడు. అతడు కచ్చితంగా టాప్-3లో బ్యాటింగ్ చేస్తాడు. ఇషాన్ తనకు లభించిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాడని సూర్య పేర్కొన్నాడు.
కాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్గా వచ్చిన సంజూ.. వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. దీంతో శుభ్మన్ గిల్ను కాదని సంజూకు వరల్డ్కప్ జట్టులో సెలెక్టర్లు చోటు ఇచ్చారు. కానీ ఈ మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.
ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 5 మ్యాచ్ల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అదే సమయంలో రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కిషన్ తన సంచలన ప్రదర్శనలతో అందరిని మంత్రముగ్ధులను చేస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్లో కూడా 200పైగా స్ట్రైక్ రేట్తో సెంచరీ సాధించి, సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో కూడా ఓపెనర్గా వచ్చి కిషన్ సత్తాచాటాడు. దీంతో ప్రధాన టోర్నీలో కూడా కిషన్కే ఓపెనర్గా పంపాలని గంభీర్ అండ్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికాతో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.


