ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హొసేన్పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు మద్దతు ఇవ్వాలనుకుంటే పర్లేదని.. కానీ అనవసరంగా భారత్ను ఇందులోకి లాగితే సహించేది లేదని సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఆతిథ్య దేశమైన భారత్లో తమకు భద్రత లేదని.. పాక్తో పాటు తమ మ్యాచ్లను కూడా శ్రీలంకలో నిర్వహించాలని బంగ్లాదేశ్ కోరింది. అయితే, బంగ్లా ఆరోపణల్లో నిజం లేదని తేల్చిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పునరాలోచన చేయాల్సిందిగా బంగ్లాకు అవకాశం ఇచ్చింది.
బంగ్లా మొండివైఖరికి భారీ మూల్యం
అయినప్పటికీ బంగ్లాదేశ్ మొండి వైఖరి వీడకపోవడంతో బంగ్లాను టోర్నీ నుంచి తొలగించిన ఐసీసీ.. రాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను టోర్నీలో చేర్చింది. ఈ నేపథ్యంలో తాము బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో మ్యాచ్ బాయ్కాట్ చేస్తామని పాక్ ప్రకటించింది.
భారత్ను తొలగిస్తారా?
ఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హొసేన్ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ద్వంద్వ వైఖరి మీకు మాత్రమే సాధ్యమంటూ టీమిండియా అభిమానులు అతడిని తిట్టిపోస్తున్నారు. స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. "ఒకవేళ టోర్నమెంట్ ఆరంభానికి నెల రోజుల ముందు.. ఇండియా.. 'మా ప్రభుత్వం ఆ దేశంలో వరల్డ్కప్ ఆడేందుకు ఒప్పుకోలేదు’ అని చెబితే..
ఇదే ఐసీసీ.. 'మీకు నిబంధనలు తెలుసు కదా! బ్యాడ్ లక్.. మిమ్మల్ని టోర్నీ నుంచి తొలగిస్తున్నాం’ అని చెప్పగలదా?.. అందరినీ సమానంగా చూడాలని మాత్రమే నేను చెబుతున్నా. బంగ్లాదేశ్, పాకిస్తాన్, టీమిండియా.. అన్నింటినీ ఒకే విధంగా చూడాలి.
మా దగ్గర డబ్బు ఉంది
ఇప్పుడు టీమిండియా అభిమానులు వచ్చి.. 'మాపై పడి ఏడవండి. మా దగ్గర డబ్బు ఉంది’ అంటే మనమేమీ చేయలేము. అధికారం ఉన్నవాళ్లే బాధ్యతగానూ ఉండాలి’’ అని నాసిర్ హొసేన్ అన్నాడు. అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
అపుడేమో గర్వంగా ఉందన్నావ్!
"బంగ్లాదేశ్, పాకిస్తాన్లపై మీకు సానుభూతి ఎందుకో మాకు బాగా తెలుసు. అయినా గతంలో జరిగిన విషయాలు మీకు గుర్తున్నాయా?.. 2003లో జింబాబ్వే జట్టును బాయ్కాట్ చేసింది ఇంగ్లండ్ కాదా? అప్పుడు తమరే కెప్టెన్గా ఉన్నారు కదా!
ఆ సమయంలో.. ఇంగ్లండ్ కెప్టెన్గా ఉన్నందుకు గర్వంగా ఉంది. జింబాబ్వేకు వెళ్లకపోవడమే మంచిది అని మీరు అనలేదా? 2009 టీ20వరల్డ్కప్ సమయంలో జింబాబ్వే ఆటగాళ్లకు వీసాలు నిరాకరించి... వారిని టోర్నీ నుంచి తప్పుకొనేలా చేసింది మీరు కాదా?
మీరు చేస్తే ఒప్పు.. వేరే వాళ్లు చేస్తే తప్పా? ఇప్పుడు శుద్ధపూసలాగా క్రికెట్- రాజకీయం కలపవద్దు అని సూక్తులు వల్లిస్తున్నారు. మరి ఆరోజు ఏమైంది మీ పెద్ద మనసు.
నాడు ఇంగ్లండ్ ఏం చేసిందంటే
బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎలాంటి పనులు చేసినా మీకు నచ్చుతుందేమో! అందరూ మీలా ఉండరు’’ అని చురకలు అంటిస్తున్నారు. కాగా 2003లో జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే పాలనను నిరసిస్తూ హరారేలో ఆడాల్సిన మ్యాచ్ను ఇంగ్లండ్ బహిష్కరించింది. రాజకీయ, భద్రతాపరమైన కారణాలు చూపుతూ ఇలా చేసింది.
అందుకే నాసిర్ హొసేన్కు ఆ విషయాన్ని గుర్తుచేస్తూ అతడి ద్వంద్వ వైఖరిని నెటిజన్లు ఎండగడుతున్నారు. కాగా బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై హత్యాకాండ జరుగగా.. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ను బీసీసీఐ తొలగించింది. దీనిని సాకుగా చూపి భద్రతా కారణాలంటూ బంగ్లాదేశ్ రాగం ఎత్తుకుని మూల్యం చెల్లించింది. మరోవైపు.. పాక్లో గతంలో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.
చదవండి: మాపై ఉగ్రదాడి జరిగింది: పాకిస్తాన్కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ


