టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం(ఫిబ్రవరి 5) దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో హర్షిత్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు.
వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఏ మాత్రం ఫలితం లేదు. ఈ క్రమంలో రాణా ఫిజియో సాయంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం అతడిని అస్పత్రికి తరలించి స్కాన్లు నిర్వహించారు. అయితే స్కాన్లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం.
రాణా గాయం నుంచి కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే పొట్టి ప్రపంచకప్ దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం బీసీసీఐ నుంచి కూడా అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశముంది.
కెప్టెన్ల మీట్ సందర్భంగా భారత సారథి సూర్యకుమార్ యాదవ్ కూడా హర్షిత్ అందుబాటుపై సందేహం వ్యక్తం చేశాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 7న వాంఖడే వేదికగా అమెరికాతో తలపడనుంది. ఒకవేళ హర్షిత్ టోర్నీ నుంచి తప్పుకొంటే ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.


