అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అయితే కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు.
హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓపెనర్ ఆరోన్ జార్జ్ త్వరగా ఔటైనప్పటికి వైభవ్ మాత్రం కెప్టెన్ ఆయూష్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి బ్యాటింగ్ చూసి ప్రత్యర్ది బౌలర్లు గజగజ వణికిపోయారు. ఈ క్రమంలో అతడు కేవలం 55 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.
ఓవరాల్గా సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు మాత్రే(53), అభిజ్ఞాన్ కుండు(40), కనిష్క్ చౌహాన్(37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలా రెండు వికెట్లు సాధించారు.
టీమిండియా సరికొత్త చరిత్ర
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్పై ఆసీస్ 253 పరుగులు చేసింది. తాజా మ్యాచ్లో 411 పరుగులు చేసిన యంగ్ ఇండియా.. కంగారుల ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.
అండర్-19 ప్రపంచకప్లో 400 పరుగుల మార్కును అత్యధిక సార్లు దాటిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. టీమిండియా మూడు సార్లు 400కు పైగా టోటల్స్ను నమోదు చేసింది.


