BCCI: హై పెర్ఫార్మెన్స్‌ శిబిరానికి త్రిష, ధృతి | BCCI U19 Camp in Bengaluru: Gongadi Trisha Kesari Drithi Selected | Sakshi
Sakshi News home page

BCCI: హై పెర్ఫార్మెన్స్‌ శిబిరానికి త్రిష, ధృతి

Apr 11 2025 3:59 PM | Updated on Apr 11 2025 4:39 PM

BCCI U19 Camp in Bengaluru: Gongadi Trisha Kesari Drithi Selected

సాక్షి, హైదరాబాద్‌: అండర్‌–19 స్థాయిలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న తెలంగాణ ప్లేయర్లు గొంగడి త్రిష (Gongadi Trisha), కేసరి ధృతి (Kesari Drithi)కి హై పెర్ఫార్మెన్స్‌ క్యాంప్‌ నుంచి పిలుపు వచ్చింది. 

బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఈ నెల 21 నుంచి మే 15 వరకు బీసీసీఐ అండర్‌–19 మహిళల హై పెర్ఫార్మెన్స్‌ క్యాంప్‌ జరగనుంది. దీని కోసం ఆలిండియా మహిళల సెలెక్షన్‌ కమిటీ తెలంగాణ నుంచి త్రిష, ధృతిని ఎంపిక చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా త్రిష 
ఈ ఏడాది ఆరంభంలో మలేసియా వేదికగా జరిగిన ఐసీసీ మహిళల అండర్‌–19 టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగి 309 పరుగులతో టోర్నమెంట్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచిన త్రిష 7 వికెట్లు సైతం పడగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కించుకుంది.

ఇక ధృతి వరల్డ్‌ కప్‌ నెగ్గిన జట్టులో సభ్యురాలైనా... ఆమెకు తుది జట్టులో చోటు దక్కలేదు. హై పెర్ఫార్మెన్స్‌ క్యాంప్‌లో ప్లేయర్ల నైపుణ్యాలను పెంపొదించడంతో పాటు... ఫిట్‌నెస్‌ను మరింత మెరుగు పర్చనున్నారు. దీని కోసం బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ప్రత్యేక ప్రోగ్రామ్‌ను సిద్ధం చేశారు.    

ఇదీ చదవండి: నిగార్‌ సుల్తానా సూపర్‌ సెంచరీ 
లాహోర్‌: కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా (80 బంతుల్లో 101; 15 ఫోర్లు, 1 సిక్స్‌) ‘శత’క్కొట్టడంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్‌ జట్టు బోణీ కొట్టింది. గురువారం జరిగిన పోరులో బంగ్లాదేశ్‌ మహిళల జట్టు 178 పరుగుల తేడాతో థాయ్‌లాండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.

వన్డేల్లో బంగ్లాదేశ్‌ జట్టుకిదే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నిగార్‌ సుల్తానా ధనాధన్‌ షాట్లతో సెంచరీ పూర్తి చేసుకోగా... షర్మిన్‌ అక్తర్‌ (126 బంతుల్లో 94 నాటౌట్‌; 11 ఫోర్లు) శతకానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫర్జానా హక్‌ (53) అర్ధశతకంతో రాణించింది. 

ధాయ్‌లాండ్‌ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న బంగ్లాదేశ్‌ బ్యాటర్లు జట్టుకు మంచి స్కోరు అందించారు. అనంతరం లక్ష్యఛేదనలో థాయ్‌లాండ్‌ జట్టు 28.5 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. 

చునిడా సుతిరాంగ్‌ (22) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో ఫహీమ, జన్నతుల్‌ ఫిర్దోస్‌ చెరో 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. తదుపరి మ్యాచ్‌లో ఆదివారం ఐర్లాండ్‌తో బంగ్లాదేశ్‌ జట్టు తలపడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement