
ఐపీఎల్ మ్యాచ్లను నిలిపివేసిన బీసీసీఐ
కొనసాగించడంపై త్వరలో నిర్ణయం
ఆటకంటే దేశం ముఖ్యమని బోర్డు ప్రకటన
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2025 మ్యాచ్లకు బ్రేక్ పడింది. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లీగ్ను వెంటనే నిలిపివేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. లీగ్ను ‘వారం రోజుల పాటు’ ఆపేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. గురువారం ధర్మశాలలో ఢిల్లీ, పంజాబ్ మధ్య మ్యాచ్ను అకస్మాత్తుగా ఆపేసినప్పుడే లీగ్ కొనసాగడంపై సందేహాలు వచ్చాయి.
శుక్రవారం దీనిని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు యుద్ధం సాగుతుండగా, మరోవైపు ఐపీఎల్ రూపంలో వినోదం కొనసాగడం సరైంది కాదని బోర్డు భావించింది. ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లతో పాటు లీగ్తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్నవారందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. ‘ఐపీఎల్ భాగస్వాములందరితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం.
ప్రస్తుత స్థితిలో మేం దేశం వెంట ఉన్నాం. ప్రభుత్వానికి, సైన్యానికి మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ ధైర్యసాహసాలకు మేం సెల్యూట్ చేస్తున్నాం. మన దేశంలో క్రికెట్ పట్ల అపరిమిత ప్రేమ ఉందనేది వాస్తవం. అయితే దేశంకంటే, దేశం సార్వభౌమత్వం, భద్రతకంటే ఏదీ ఎక్కువ కాదు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే బీసీసీఐ ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది.
మాకు మద్దతుగా నిలిచిన ఐపీఎల్ భాగస్వాములందరికీ కృతజ్ఞతలు’ అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. లీగ్ కొనసాగించడం, కొత్త తేదీలు, వేదికలపై అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత పరిస్థితులను బట్టి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కూడా బోర్డు స్పష్టం చేసింది.
క్రికెటర్లు స్వస్థలాలకు...
ఐపీఎల్ వాయిదాపై ప్రకటన వచ్చిన వెంటనే అన్ని జట్లలోని క్రికెటర్లు తమ సొంత నగరాలకు బయలుదేరేలా ఆయా ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేశాయి. స్వదేశానికి వెళ్లిపోవాలనుకునే విదేశీ క్రికెటర్లకు ఏర్పాట్లపరంగా ‘ప్లేయర్స్ అసోసియేషన్’ సహకరిస్తోంది. గురువారం ధర్మశాలలో మ్యాచ్ రద్దయ్యాక ఢిల్లీ, పంజాబ్ క్రికెటర్లు, సహాయక సిబ్బందిని ముందుగా బస్సు ద్వారా జలంధర్కు తరలించారు. అక్కడి నుంచి వారంతా ప్రత్యేక వందేభారత్ రైలులో ఢిల్లీకి పయనమయ్యారు.
విమర్శల బారిన పడరాదనే...
ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో 58 మ్యాచ్లు ముగియగా... మరో 12 మ్యాచ్లు మాత్రమే మిగిలాయి. వీటిలో అహ్మదాబాద్లో మూడు... లక్నో, బెంగళూరులలో రెండు చొప్పున...హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, జైపూర్లలో ఒక్కో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇవి కాకుండా 4 ప్లే ఆఫ్స్లలో రెండేసి మ్యాచ్లకు హైదరాబాద్, కోల్కతా వేదికగా నిర్వహించాల్సి ఉంది. వాస్తవికంగా చూస్తే సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఉన్నా... ఉత్తరాదిలోని కొన్ని నగరాలు మినహా ఈశాన్యం, దక్షిణం వైపు సాధారణ పరిస్థితులే ఉన్నాయి.
బీసీసీఐ స్థాయి, దానికి ఉన్న సాధన సంపత్తిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కేవలం వేదికలు మార్చి చకచకా ఈ 16 మ్యాచ్లు నిర్వహించడం ఏమాత్రం సమస్య కాదు. అయితే ఒకవైపు యుద్ధం సాగుతుంటే, మన సైనికులు పోరాడుతుంటే మీకు ఆటలు కావాలా అని సగటు భారతీయుడు ఆగ్రహిస్తున్నాడు. ఇంత సంకట స్థితిలో ఎన్నో విషయాల్లో ప్రభుత్వం నుంచి ఆంక్షలు, హెచ్చరికలు వస్తుండగా ఐపీఎల్ మాత్రం కొనసాగడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడింది.
అయితే పూర్తిగా సీజన్ను రద్దు చేయకుండా, లేక సుదీర్ఘ సమయం వాయిదా వేయకుండా ‘ఒక వారం వాయిదా’ అంటూ సన్నాయి నొక్కులు చూపిస్తోంది. బహుశా వచ్చే వారం రోజుల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని, అప్పుడు మళ్లీ ఆడించవచ్చనే ఆలోచన కనిపిస్తోంది!
ప్రత్యామ్నాయ తేదీలు ఏవి?
బీసీసీఐ ‘వారం’ విరామం ప్రకటనను బట్టి చూస్తే వెంటనే కొనసాగించాలని భావిస్తున్నట్లుగా ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న ఐపీఎల్ ముగియాలి. ఇప్పుడు మరో వారం దీనికి జోడిస్తే జూన్ 1న ముగిసేలా కొత్త షెడ్యూల్ ఇవ్వవచ్చు. సరిగ్గా చెప్పాలంటే టోర్నీని ముగించేందుకు బోర్డుకు 10 రోజులు చాలు.
‘డబుల్ హెడర్’లుగా రోజుకు రెండు లీగ్ మ్యాచ్ల చొప్పున 6 రోజులు... ప్లే ఆఫ్స్కు మరో 4 రోజులు సరిపోతాయి. జూన్ మొదటి వారంలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది కాబట్టి కష్టమనే చర్చ ఉన్నా... తొలి టెస్టు జూన్ 20న మొదలవుతుంది. ఐపీఎల్లో ఆడుతున్న టెస్టు జట్టు సభ్యులు జూన్ 10 వరకు చేరుకున్నా సమస్య లేదు.
ఇప్పటికిప్పుడు మ్యాచ్లు నిర్వహించకుండా ఆగిపోతే ఇంగ్లండ్ సిరీస్ తర్వాత ఆగస్టు, సెపె్టంబర్ వరకు లీగ్ వెళుతుంది. అయితే ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్తో వన్డే, టి20 సిరీస్లను ఆడనుంది. దీనిని వాయిదా వేసినా ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్, ఇంగ్లండ్ బోర్డు నిర్వహించే ‘హండ్రెడ్’ టోర్నీలు ఉన్నాయి. ‘హండ్రెడ్’లో సగం జట్లను ఐపీఎల్ యజమానులే కొన్నారు కాబట్టి ఇది అసాధ్యం.
సెప్టెంబర్లో 19 రోజులు ‘ఆసియా కప్’ టోర్నీకి కేటాయించారు. దీనికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇక్కడ ఆడకపోవడమే కాదు... భారత్, పాక్ మధ్య మ్యాచ్లు జరగడం కూడా అసాధ్యమే! కాబట్టి ఈ ఒక్క టోర్నీని రద్దు చేస్తే ఐపీఎల్కు కావాల్సిన సమయం లభిస్తుంది.