PC: BCCI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2027 సీజన్కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. క్యాష్ రిచ్ లీగ్ ఇరవయ్యవ ఎడిషన్.. గత సీజన్తో పోలిస్తే దాదాపు రెండు వారాల ముందే ఆరంభం అవుతుందని వెల్లడించింది.
మరోసారి బెంగళూరుదే టైటిల్
కాగా ఐపీఎల్-2026 మార్చి 28న మొదలై.. మై 31న ఫైనల్తో ముగిసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో.. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. గుజరాత్ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది.
ముందుగానే ఐపీఎల్
ఇక వచ్చే సీజన్ విండో గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. PTIతో మాట్లాడుతూ.. మార్చి 10 నుంచి మే 15 మధ్య టోర్నీ నిర్వహణ కోసం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపాడు. ‘‘ఈ ఏడాది ఐపీఎల్ 28 మార్చిలో మొదలై.. మే 31న ముగిసింది.
కారణం ఇదే
నిజానికి మే 15 తర్వాత చాలా చోట్ల వాతావరణం కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. కొన్నిచోట్ల ముందుగానే రుతుపవనాల రాకతో వర్షం పడింది. అందుకే వచ్చే ఏడాది నుంచి షెడ్యూల్ మార్చాలని అనుకుంటున్నాం.
ఇందుకు సంబంధించి మా జనరల్ మేనేజర్కు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాను. మార్చి 10- మే 15 మధ్య టోర్నీ జరిగేలా షెడ్యూల్ వీలు అవుతుందో చూడమన్నాను.
ప్లే ఆఫ్స్, ఫైనల్కు వర్షం అడ్డంకిగా మారకుండా ముందుగానే చర్యలు తీసుకోవాల్సి ఉంది. వాతావరణ పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడడం కంటే షెడ్యూల్లో మార్పు చేస్తే బాగుంటుందనే యోచనలో ఉన్నాము’’ అని దేవజిత్ సైకియా తెలిపాడు.


