శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్‌.. భారత జట్టు ప్రకటన | BCCI Announced Women Squad For Tri Series: Harmanpreet Returns To Lead | Sakshi
Sakshi News home page

BCCI: శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్‌.. భారత జట్టు ప్రకటన

Apr 8 2025 11:46 AM | Updated on Apr 8 2025 12:46 PM

BCCI Announced Women Squad For Tri Series: Harmanpreet Returns To Lead

శ్రీలంకలో పర్యటించనున్న మహిళా క్రికెట్‌ జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. శ్రీలంక- సౌతాఫ్రికాలతో జరుగనున్న త్రైపాక్షిక వన్డే సిరీస్‌కు పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును వుమెన్స్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసినట్లు మంగళవారం వెల్లడించింది.

హర్మన్‌ప్రీత్‌ పునరాగమనం
ఈ ‍ప్రతిష్టాత్మక సిరీస్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (Harmanpreet Kaur) భారత జట్టును ముందుకు నడిపించనుండగా.. స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా కొనసాగనుంది. ఇక ఈ జట్టులో హైదరాబాదీ అమ్మాయి అరుంధతి రెడ్డి, ఆంధ్ర క్రికెటర్‌, అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ నల్లపురెడ్డి శ్రీచరణి  కూడా చోటు దక్కించుకున్నారు.

అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు చోటు
అంతేకాదు.. శ్రీచరణితో పాటు మరో ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు కశ్వీ గౌతమ్‌ (Kashvi Gautam), శుచీ ఉపాధ్యాయ్‌కు కూడా సెలక్టర్లు చోటివ్వడం విశేషం. మరోవైపు.. గాయాల కారణంగా రేణుకా సింగ్‌ ఠాకూర్‌, టైటస్‌ సాధు ఈ వన్డే సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.

చివరగా మంధాన సారథ్యంలో
కాగా జనవరిలో ఐర్లాండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. హర్మన్‌కు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు ఆమె స్థానంలో మంధానకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో జనవరి 10- 15 వరకు జరిగిన ఈ సిరీస్‌లో మంధాన సేన ఐర్లాండ్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ సిరీస్‌లో మంధానకు దీప్తి శర్మ డిప్యూటీగా వ్యవహరించింది.

అన్నీ ఒకే స్టేడియంలో
ఇక ఏప్రిల్‌ 27 నుంచి శ్రీలంక- భారత్‌- సౌతాఫ్రికా మధ్య ట్రై సిరీస్‌ మొదలుకానుంది. ఇందులో భాగంగా నాలుగు మ్యాచ్‌లకూ శ్రీలంకలోని కొలంబోలోని ఆర్‌. ప్రేమదాస మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరిగే ఈ సిరీస్‌లో ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో టాప్‌-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్‌కు భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), యస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, కశ్వీ గౌతమ్, స్నేహ్‌ రాణా, అరుంధతీ రెడ్డి, తేజల్ హసాబ్నిస్‌, శ్రీచరణి, శుచీ ఉపాధ్యాయ్‌.

ట్రై సిరీస్‌లో భారత్‌ షెడ్యూల్‌ ఇదే
ఏప్రిల్‌ 27, ఆదివారం- ఇండియా వర్సెస్‌ శ్రీలంక
ఏప్రిల్‌ 29, మంగళవారం- ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా
మే 4, ఆదివారం- ఇండియా వర్సెస్‌ శ్రీలంక
మే 7, బుధవారం- ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా.

చదవండి: గిల్‌, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్‌ దేవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement