బుమ్రా ఎడమ చేత్తో బౌలింగ్‌ చేయాలని చట్టం తెస్తాం | Australian Prime Minister Albanese hosts India and Australia teams | Sakshi
Sakshi News home page

బుమ్రా ఎడమ చేత్తో బౌలింగ్‌ చేయాలని చట్టం తెస్తాం

Jan 2 2025 3:41 AM | Updated on Jan 2 2025 6:02 AM

Australian Prime Minister Albanese hosts India and Australia teams

భారత పేసర్‌ను ఆకాశానికెత్తిన ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌

సిడ్నీ టెస్టులో ‘పింక్‌ క్యాప్‌’లతో బరిలోకి దిగనున్న ఇరు జట్లు  

సిడ్నీ: టీమిండియా మేటి పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆ్రస్టేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్‌ ఆకాశానికెత్తారు. ప్రతిష్టాత్మక ‘బోర్డర్‌–గావస్కర్‌’ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌లాడి 30 వికెట్లు పడగొట్టిన బుమ్రా... ఇకపై ఎడమ చేత్తో బౌలింగ్‌ చేసేలా చట్టం తీసుకొస్తామని ఆల్బనీస్‌ చమత్కరించారు. ‘బుమ్రా ఎడమ చేత్తో బౌలింగ్‌ చేయాలి. లేదా రనప్‌ తగ్గించుకోవాలి. ఈ మేరకు చట్టం తీసుకొస్తాం. అతడు బౌలింగ్‌కు వచి్చన ప్రతిసారి చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంటుంది’ అని ఆల్బనీస్‌ పేర్కొన్నారు. 

సిడ్నీ వేదికగా శుక్రవారం నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య చివరి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లకు బుధవారం ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్‌ ఆతిథ్యమిచ్చారు. ‘భారత్, ఆ్రస్టేలియా జట్లు ఇప్పటికే ఎంతో మజానిచ్చాయి. శుక్రవారం నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది. మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌ కృషితో సిడ్నీ మైదానం గులాబీ రంగు సంతరించుకోనుంది’ అని ఆల్బనీస్‌ సామాజిక మాధ్యమాల్లో ఒక లేఖ విడుదల చేశారు. 

ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ మెక్‌గ్రాత్‌ భార్య 2008లో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడి మృతి చెందగా... అప్పటి నుంచి ఈ వ్యాధిపై మరింత అవగాహన పెంచేందుకు తన ఫౌండేషన్‌ తరఫున మెక్‌గ్రాత్‌ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. 

ఇందులో భాగంగానే చివరి టెస్టులో భారత్, ఆ్రస్టేలియా జట్లు గులాబీ క్యాప్‌లు ధరించి బరిలోకి దిగనున్నాయి. ప్రధానితో భేటీ అనంతరం టీమిండియా హెడ్‌కోచ్‌ గంభీర్‌ మాట్లాడుతూ... ‘ఆ్రస్టేలియా అందమైన దేశం. కానీ ఇక్కడ పర్యటించడం చాలా కష్టం. అభిమానుల నుంచి మంచి మద్దతు లభించింది. 

సిరీస్‌లో మరో టెస్టు మిగిలుంది. దీంట్లో కూడా ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు. ఆ్రస్టేలియా సారథి కమిన్స్‌ మాట్లాడుతూ... ‘మెల్‌బోర్న్‌ టెస్టును ఎప్పటికీ మరవలేం. ఐదు రోజుల పాటు హోరాహోరీగా సాగిన పోరులో విజయం సంతృప్తినిచి్చంది. సిరీస్‌ గెలవాలనే లక్ష్యంతో చివరి టెస్టు బరిలోకి దిగుతాం’అని పేర్కొన్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement