న్యూయార్క్: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం అమెరికాలోని న్యూయార్క్ ట్రై–స్టేట్ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరిగాయి. న్యూజెర్సీలోని పర్సిప్పనీ వెటరన్స్ మెమోరియల్ పార్క్లో భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవం, అమెరికా 250వ అవతరణ వార్షికోత్సవం సందర్భంగా అత్యధిక ఫ్లాగ్పోల్స్తో 250 ఆకారాన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఈ విషయాన్ని భారత కాన్సులేట్ ఎక్స్లో ప్రకటించింది.
కార్యక్రమంలో భాగంగా 1,300కు పైగా అమెరికా జెండాలను, వాటి చుట్టూ త్రివర్ణ పతాకాలను ఏర్పాటు చేశారు. న్యూయార్క్ సిటీ భారత సంతతి మేయర్ జొహ్రాన్ మమ్దానీ క్వీన్స్లోని ఫ్లోరల్ పార్క్లో జరిగిన ఇండియా డే పరేడ్లో పాల్గొన్నారు.
అనంతరం, మమ్దానీ ఎక్స్లో తనను తాను మొట్టమొదటి భారత–అమెరికన్ న్యూయార్క్ నగర మేయర్గా చెప్పుకుంటూ..‘ఇదొక అద్భుత అనుభవం. ఎన్నటికీ మర్చిపోలేనిది’అని పేర్కొన్నారు. కాగా, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సహా పలు ప్రముఖ కట్టడాలు త్రివర్ణ శోభతో మెరిసిపోయాయి. టైమ్స్ స్క్వేర్లో జరిగిన కార్యక్రమంలో భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.


