
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్-2025లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా తొలి సవాల్ను ఎదుర్కొనేందుకు సిద్దమైంది. డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో భాగంగా నేటి నుంచి వెస్టిండీస్-ఆసీస్ మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు బార్బోడోస్ వేదికగా జరగనుంది.
ఈ క్రమంలో మొదటి టెస్టు కోసం ఆసీస్, విండీస్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాయి. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు కంగారులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టీవ్ స్మిత్ చేతి వేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు.
అతడి స్దానంలో తుది జట్టులోకి వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ వచ్చాడు. అదేవిధంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ ఇన్నింగ్స్ను ఆరంభించిన మార్నస్ లబుషేన్ను సెలక్టర్లు పక్కన పెట్టారు. లబుషేన్ స్దానంలో సామ్ కాన్స్టాస్ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నాడు. గతేడాది ఆఖరిలో భారత్పై టెస్టు అరంగేట్రం చేసిన కాన్స్టాస్ తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి మళ్లీ టీమ్ మెన్జ్మెంట్ మరో అవకాశం కల్పించింది.
ఇక ఈ రెండు మార్పులు మినహా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడినే జట్టును ఆసీస్ కొనసాగించింది. మరోవైపు ఈ సిరీస్ నుంచే స్టార్ ఆల్రౌండర్ రోస్టన్ చేజ్ వెస్టిండీస్ టెస్టు కెప్టెన్గా తన ప్రస్ధానాన్ని ప్రారంభించనున్నాడు. గత నెలలో క్రెయిగ్ బ్రాత్వైట్ విండీస్ టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో చేజ్ ఎంపిక అనివార్యమైంది. ఈ మ్యాచ్లో విండీస్ నలుగురు పేసర్లు, ఒక స్పెషలిస్టు స్పిన్నర్తో బరిలోకి దిగనుంది.
తుది జట్లు
వెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్: 1. క్రెయిగ్ బ్రాత్వైట్, 2. జాన్ కాంప్బెల్, 3. కీసీ కార్టీ, 4. బ్రాండన్ కింగ్, 5. రోస్టన్ చేజ్ (సి), 6. షాయ్ హోప్ (వికెట్ కీపర్), 7. జస్టిన్ గ్రీవ్స్, 8. జోమెల్ వారికన్, 9. అల్జారి జోసెఫ్, 10. షమర్ జోసెఫ్, 11. జేడెన్ సీల్స్
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: 1. ఉస్మాన్ ఖవాజా, 2. సామ్ కాన్స్టాస్, 3. కామెరాన్ గ్రీన్, 4. జోష్ ఇంగ్లిస్, 5. ట్రావిస్ హెడ్, 6. బ్యూ వెబ్స్టర్, 7. అలెక్స్ కారీ (వికెట్ కీపర్), 8. పాట్ కమ్మిన్స్ (సి), 9. మిచెల్ స్టార్క్, 10. నాథన్ లియాన్, 11. జోష్ హాజిల్వుడ్