
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగింపునకు చేరుకుంది. నాలుగో రోజు మొదటి సెషన్లో ఫలితం తేలే అవకాశముంది. తొలి డబ్ల్యూటీసీ టైటిల్ విజయానికి సౌతాఫ్రికా కేవలం 69 పరుగుల దూరంలో నిలవగా.. ఆస్ట్రేలియా 8 వికెట్ల దూరంలో ఉంది.
ఆసీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా అద్బుతం జరిగాలి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెట్టోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ మ్యాచ్ ఇంకా ముగియలేదని, గెలిచేందుకు ఇంకా దారులు తెరిచే ఉన్నాయని ఈ కివీస్ మాజీ కెప్టెన్ తెలిపాడు.
282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(102), బావుమా(65) ఉన్నారు.
"ఈ ఫైనల్ మ్యాచ్పై మాకు ఇంకా ఆశలు ఉన్నాయి. మ్యాచ్ ఇంకా ముగియలేదు, ఒక్క వికెట్ పడితే ఏదైన జరగొచ్చు. ప్రస్తుతం మార్క్రమ్, బావుమా తమ ఆధీనంలో ఉంచుకున్నారు. కానీ ఎవరో ఒకరు ఔటయ్యాక కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చే పరిస్థితి వెరే విధంగా ఉంటుంది.
ఇప్పుడు వికెట్లు ఎలా తీయాలన్నదే మేము ఆలోచిస్తున్నాము. తొలి సెషన్లో సవాల్లను ఎదుర్కొనేందుకు మా బౌలర్లు సిద్దంగా ఉన్నారని" వెట్టోరి మూడో రోజు ఆట అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో నిప్పులు చెరిగిన స్టార్క్, కమ్మిన్స్, హాజిల్వుడ్ ఆసీస్ పేస్ త్రయం.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం పూర్తిగా తెలిపోయారు. స్టార్క్ ఒక్కడే ఇప్పటివరకు రెండు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: WTC Final 2025: మార్క్రమ్ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు