
రెండో ఐసీసీ ట్రోఫీని ముద్దాడేందుకు సౌతాఫ్రికా అడుగు దూరంలో నిలిచింది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్తోంది. మరో 69 పరుగులు సాధిస్తే 27 ఏళ్ల మరో ఐసీసీ టైటిల్ సఫారీల ఖాతాలో చేరనుంది.
282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్ అద్బుత శతకంతో చెలరేగాడు. మార్క్రమ్ 102 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు కెప్టెన్ టెంబా బావుమా(65 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.
తొలి ఆటగాడిగా..
ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన ఐడైన్ మార్క్రమ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ నాల్గవ ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా మార్క్రమ్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎవరూ ఫీట్ సాధించలేకపోయారు.
ఓవరాల్గా మార్క్రమ్ కంటే ముందు డబ్ల్యూటీసీ ఫైనల్లో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ మాత్రమే సెంచరీ సాధించారు. అయితే ఈ రెండు సెంచరీలు కూడా తొలి ఇన్నింగ్స్లో వచ్చినవే కావడం గమనార్హం. అదేవిధంగా లార్డ్స్ మైదానంలో ఒకే టెస్టులో డకౌట్, సెంచరీ నమోదు చేసిన తొమ్మిదవ బ్యాటర్గా మార్క్రమ్ నిలిచాడు.
చదవండి: విజయం దిశగా దక్షిణాఫ్రికా