ఆ ముగ్గురితో జాగ్రత్త.. రోహిత్‌ ఆ విషయం గుర్తు పెట్టుకో: ఆసీస్‌ దిగ్గజం వార్నింగ్‌ | Asia Cup 2023 IND vs. PAK: Beware Of Afridi Hayden Warning To Rohit Reminder 2021 WC - Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురితో జాగ్రత్త.. లేదంటే అంతే సంగతులు: టీమిండియాకు ఆసీస్‌ దిగ్గజం వార్నింగ్‌

Sep 1 2023 4:36 PM | Updated on Sep 1 2023 5:02 PM

Asia Cup Ind vs Pak: Beware Of Afridi Hayden Warning To Rohit Reminder 2021 WC - Sakshi

Asia Cup 2023- India Vs Pakistan: ఆసియా కప్‌-2023 టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా తప్పక విజయం సాధిస్తుందని ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం మాథ్యూ హెడెన్‌ అన్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి రోహిత్‌ సేన శుభారంభం చేస్తుందని పేర్కొన్నాడు. అయితే, పాక్‌ పేస్‌ దళం వ్యూహాలను భారత బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కోవాలని.. లేదంటే చేదు అనుభవం తప్పదని హెడెన్‌ హెచ్చరించాడు. 

శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో శనివారం టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. గ్రూప్‌-ఏలో భాగమైన నేపాల్‌పై ఘన విజయంతో ఆధిక్యంలో ఉన్న పాక్ తదుపరి మ్యాచ్‌లో దాయాదిని ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ షో గేమ్‌ ప్లాన్‌లో భాగంగా మాథ్యూ హెడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

భూగ్రహం మీద అత్యంత ఆసక్తికర మ్యాచ్‌
‘‘భూగ్రహం మీద అత్యంత ఆసక్తికర మ్యాచ్‌ అనడంలో సందేహం లేదు. అయితే, పాకిస్తాన్‌ పేస్‌త్రయం విషయంలో టీమిండియా కాస్త జాగ్రత్తగా ఉండాలి. షాహిన్‌ ఆఫ్రిది, హ్యారిస్‌ రవూఫ్‌, నసీం షా.. భిన్న రకాల, వైవిధ్యం కలిగిన బౌలర్లు. 

రవూఫ్‌ తక్కువేమీ కాదు
భారత బ్యాటర్ల కోసం ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుని ఉంటారు. క్యాండీలో బౌన్సీ వికెట్‌కు ఆస్కారం ఉంది. కాబట్టి పేసర్ల విషయంలో ముఖ్యంగా రవూఫ్‌ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఒక్కసారి పట్టు దొరికితే భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేయగల సత్తా అతడికి ఉంది.

ఆఫ్రిది విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా
ఇక షాహిన్‌ ఆఫ్రిది.. గత వరల్డ్‌కప్‌ సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే! షాహిన్‌ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అద్భుత బంతితో అవుట్‌ చేసిన తీరు ఎవరూ మర్చిపోలేరు.

అయితే, క్లాసిక్‌ బ్యాటర్లు గెలిపించగలరు
కాబట్టి ఈసారి షాహిన్‌ ఆఫ్రిది ఎదుర్కొనేటపుడు రోహిత్‌ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అతడి బౌలింగ్‌లో మొదటి మూడు ఓవర్లలో ఆచితూచి ఆడాల్సి ఉంటుంది’’ అని మాథ్యూ హెడెన్‌ టీమిండియాకు సలహా ఇచ్చాడు. అయితే, పటిష్ట టీమిండియా బ్యాటర్లు పాక్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచగలరని.. తద్వారా జట్టుకు విజయం అందించగలరని అభిప్రాయపడ్డాడు.

నాడు ఘోర ఓటమి..
కాగా టీ20 వరల్డ్‌కప్‌-2021లో షాహిన్‌ ఆఫ్రిది.. టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ(3), రోహిత్‌ శర్మ(0)ల వికెట్లు తీసి ఆరంభంలోనే టీమిండియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌, టాప్‌ స్కోరర్‌ విరాట్‌ కోహ్లి (57) వికెట్‌ కూడా అతడే దక్కించుకున్నాడు. నాటి మ్యాచ్‌లో భారత జట్టు కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

చదవండి: పాకిస్తాన్‌దే పైచేయి! అక్కడ టీమిండియాదే హవా.. నాడు రోజర్‌ బిన్నీ, రవిశాస్త్రి కారణంగా..

Advertisement
 
Advertisement
Advertisement