source: IPL X
షేర్-ఎ పంజాబ్ టీ20 లీగ్ 2026లో ఐపీఎల్ ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ రెండు విధ్వంసకర శతకాలతో విరుచుకుపడగా.. తాజాగా ముంబై ఇండియన్స్ బ్యాటర్ నమన్ ధిర్ తన రెండో శతకంతో బీభత్సం సృష్టించాడు.
ఈ టోర్నీలో అమృత్సర్ సూర్మాస్కు సారథ్యం వహిస్తున్న నమన్.. మోహాలీ కింగ్స్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో శివాలెత్తిపోయాడు. కేవలం 64 బంతుల్లో 16 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో ఏకంగా 173 పరుగులు చేశాడు. నమన్ వీరంగం సృష్టించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సూర్మాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 279 పరగుల (7 వికెట్ల నష్టానికి) రికార్డు స్కోర్ చేసింది.
సూర్మాస్ జట్టులో నమన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జస్ప్రీత్ సింగ్ (41) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. సహజ్ ధవన్ 1, రాహుల్ కుమార్ 13, అభిషేక్ శర్మ 13, అభయ్ చౌదరి 20, ఆకాశ్ పాండే 4 పరుగులు చేసి ఔటయ్యారు. మోహాలీ బౌలర్లలో ఆయుశ్ గోయల్ 4 వికెట్లతో రాణించగా.. హర్ప్రీత్ బ్రార్, హర్ష్దీప్ సింగ్, తేజ్ప్రీత్ సింగ్ తలో వికెట్ తీశారు.
కాగా, ఈ టోర్నీలో మరో ఐపీఎల్ ఆటగాడు రమన్దీప్ సింగ్ (కేకేఆర్), టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా సత్తా చాటుతున్నారు. రమన్దీప్ సింగ్ 6 మ్యాచ్ల్లో 4 మెరుపు అర్ద శతకాలతో చెలరేగగా.. అభిషేక్ శర్మ 2, శుభ్మన్ గిల్ ఓ హాఫ్ సెంచరీతో రాణించారు.
చదవండి: రెచ్చిపోయిన కేకేఆర్ బ్యాటర్; 9 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం


