source: X
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3లో భారత పారా ఆర్చర్లు అదరగొట్టారు. పోటీల చివరి దశకు చేరుకున్న సమయంలో భారత్ ఖాతాలో రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం చేరాయి.
పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి జోడీ స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఇరాక్కు చెందిన అబ్బాస్ కదీమ్, అన్వర్ అల్దావూద్ జోడీపై 152-139తో ఘన విజయం సాధించింది.
పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో పారాలింపిక్స్లో రెండుసార్లు పతకాలు సాధించిన హర్విందర్ సింగ్, విజయ్ సుండి జోడీ కూడా బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. తొలి సెట్లో వెనుకబడిన భారత జోడీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని స్లోవేకియా జోడీపై 6-2తో విజయం సాధించింది.
మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో భావన, పూజా జోడీ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఈ జోడీ చైనా జోడీ చేతిలో ఓటమి పాలైంది.
చదవండి: నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..


