ఆ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడలేదు: భారత మాజీ క్రికెటర్‌ వ్యంగ్యాస్త్రాలు | All Those Matches: Former India Star Sarcastic take on Critics IND Consistency | Sakshi
Sakshi News home page

ఆ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడలేదు: భారత మాజీ క్రికెటర్‌ వ్యంగ్యాస్త్రాలు

Mar 10 2025 3:16 PM | Updated on Mar 10 2025 3:59 PM

All Those Matches: Former India Star Sarcastic take on Critics IND Consistency

విమర్శకులకు చెంపపెట్టులాంటి సమాధానం అంటూ అభిమానుల ప్రశంసలు

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)ని టీమిండియా అజేయంగా ముగించింది. గ్రూప్‌ దశలో మూడింటికి మూడూ గెలిచిన రోహిత్‌ సేన.. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో న్యూజిలాండ్‌(India vs New Zealand)తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి పరిపూర్ణ విజయంతో చాంపియన్‌గా నిలిచింది.

ఈ నేపథ్యంలో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. ఒకే వేదికపై ఆడిన తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ వన్డే టోర్నమెంట్‌కు పాకిస్తాన్‌ ఆతిథ్యమివ్వగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికపైన తమ మ్యాచ్‌లు ఆడింది. దుబాయ్‌(Dubai)లోనే ఈ ఐదు మ్యాచ్‌లలో ప్రత్యర్థులతో తలపడింది.

అదనపు ప్రయోజనం అంటూ విమర్శలు
మరోవైపు.. రోహిత్‌ సేనతో మ్యాచ్‌లు ఆడేందుకు ఆయా జట్లు పాకిస్తాన్- దుబాయ్‌ మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకే మైదానంలో ఆడటం భారత్‌కు అదనపు ప్రయోజనాలను చేకూర్చిందని ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా తదితర దేశాల మాజీ క్రికెటర్లు టీమిండియా విజయాలను విమర్శించారు. 

ఈ క్రమంలో చాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేతగా భారత్‌ అవతరించిన అనంతరం.. టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ఐసీసీ టోర్నమెంట్లలో భారత జట్టు విజయాలను ఉటంకిస్తూ.. ‘‘కేవలం ఐసీసీ టైటిళ్ల విషయంలోనే కాదు.. టీమిండియా ఎన్ని ఐసీసీ మ్యాచ్‌లు గెలిచిందో కూడా చూడాలి. 

చెంపపెట్టు లాంటి సమాధానం
గత ఆరేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు అద్బుత రికార్డు ఉంది. మరొక్క మాట.. ఈ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో మాత్రం ఆడినవి కాదండోయ్‌!’’ అంటూ విమర్శకులను ఉద్దేశించి మంజ్రేకర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు అంటూ అభిమానులు మంజ్రేకర్‌ ట్వీట్‌ వైరల్‌ చేస్తున్నారు.

కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఫైనల్‌ వరకు అజేయంగా ఉన్న టీమిండియా.. టీ20 ప్రపంచకప్‌-2024లో అన్ని మ్యాచ్‌లు గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఇక చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టోర్నమెంట్లోనూ ఓటమన్నదే లేకుండా ముందుకు సాగి ట్రోఫీని ముద్దాడింది. 

అరుదైన రికార్డులు
ఈ మూడు ఈవెంట్లలో రోహిత్‌ సేన మొత్తంగా 24 మ్యాచ్‌లు ఆడగా.. ఏకంగా 23 గెలిచింది. ఒక మ్యాచ్‌ మాత్రం ఓడిపోయింది. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌-2023లో ఆస్ట్రేలియాతో చేతిలో పరాజయం పాలై ట్రోఫీని చేజార్చుకుంది.

ఇదిలా ఉంటే.. చాంపియన్స్‌ ట్రోఫీలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను కూడా భారత్‌ సాధించింది. ఈ వన్డే టోర్నమెంట్లో ఇప్పటి వరకు మొత్తంగా 34 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఇరవై మూడింట గెలిచి.. ఎనిమిది ఓడింది. మూడింట ఫలితాలు రాలేదు. ఇక ప్రపంచంలోని ఏ క్రికెట్‌ జట్టూ కూడా ఈ టోర్నీలో పదిహేను కంటే ఎక్కువ విజయాలు సాధించకపోవడం గమనార్హం.

అంతేకాదు.. ఒక వేదికపై అత్యధిక వన్డే విజయాలు సాధించిన జట్టుగానూ భారత్‌.. న్యూజిలాండ్‌ రికార్డును సమం చేసింది. దుబాయ్‌లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్‌లు ఆడి పదింట గెలిచింది. న్యూజిలాండ్‌ గతంలో డునెడిన్‌లో పదింటికి పది మ్యాచ్‌లలో విజయం సాధించింది.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్‌ భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ 
👉కివీస్ స్కోరు: 251/7 (50)
👉టీమిండియా స్కోరు: 254/6 (49)
👉ఫ‌లితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచి చాంపియ‌న్‌గా భార‌త్‌
👉ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌: రోహిత్ శ‌ర్మ‌(83 బంతుల్లో 76)

చదవండి: అతడు మా నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్‌ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement