ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో (ACC Men's Asia Cup Rising Stars 2025) ఇవాళ (నవంబర్ 21) తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది. దోహా వేదికగా భారత్-ఏ-బంగ్లాదేశ్-ఏ (India A vs Bangladesh A) జట్లు తలపడుతున్నాయి.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్ హబిబుర్ రెహ్మాన్ సోహన్ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో మెహ్రబ్ (18 బంతుల్లో 48 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది.
బంగ్లా ఇన్నింగ్స్లో జిషన్ ఆలమ్ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జవాద్ అబ్రార్ (13), యాసిర్ అలీ (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. ఆ జట్టు కెప్టెన్ అక్బర్ అలీ 9, మహిదుల్ ఇస్లాం 1 పరుగు చేయగా.. అబూ హైదర్ డకౌటయ్యాడు.
భారత బౌలర్లలో విజయ్కుమార్ వైశాక్ (4-0-51-0) భారీ పరుగులు సమర్పించుకోగా.. గుర్జప్నీత్ సింగ్ (4-0-39-2), హర్ష్ దూబే (4-0-22-1), సుయాశ్ శర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. రమన్దీప్ సింగ్ (2-0-29-1), నమన్ ధిర్ (2-0-33-1) పర్వాలేదనిపించారు.
వైభవ్ మెరుపులు కూడా మొదలయ్యాయి..!
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసాన్ని ప్రారంభించాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (7 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కూడా భారీ షాట్లు ఆడుతున్నాడు. ఫలితంగా భారత్ 3.3 ఓవరల్లో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది.


