హవేళిఘణాపూర్(మెదక్): ఇటీవల కురిసిన వర్షాలతో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ముందు టైరు బురదలో కూరుకుపోయింది. వివరాలు ఇలా.. మెదక్ పట్టణం నుంచి ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు మండలంలోని మక్తభూపతిపూర్ వైపు 50 మంది విద్యార్థులను తీసుకెళ్తుండగా పుష్పాల వాగుపై వెళ్తున్న క్రమంలో ముందు టైరు బురదలో కూరుకుపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సులో నుంచి పిల్లలను బయటకు దింపివేశారు. అనంతరం జేసీబీ సహాయంతో బస్సును వెనక్కి తీశారు. ఏడాది గడిచినా ఇంత వరకు రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేయకపోవడం మూలంగా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని, ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఎవరు బాధ్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు.
వ్యక్తి అదృశ్యం
నారాయణఖేడ్: వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మనూరు పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కోటేశ్వర్రావు వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ఉప్పరి ఈరన్న(49) నాలుగు నెలలుగా కనిపించడం లేదు. దీంతో కుంటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆయన ఆచూకీ లభించలేదు. భార్య సక్కుబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కులం పేరుతో దూషణ
వ్యక్తిపై అట్రాసిటి కేసు నమోదు
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని నర్సాయపల్లిలో కులం పేరుతో దూషించిన ఘటనలో ఓ వ్యక్తిపై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ముస్త్యాల శ్రీనివాస్ను అదే గ్రామానికి చెందిన చింతల సదానందం గత నెల 30న నర్సాయపల్లి వాట్సాప్ గ్రూప్లో కులం పేరుతో దూషించినట్లు బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అట్రాసిటి కేసు నమోదు చేశారు.
జూదం ఆడుతున్న
9 మంది అరెస్ట్
హవేళిఘణాపూర్(మెదక్): జూదం ఆడుతున్న 9మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మెదక్ మండల పరిధిలోని ర్యాలమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. గ్రామంలో బొమ్మాబొరుసు ఆడుతు న్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.7,910 నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
అక్రమ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
చేగుంట(తూప్రాన్): అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న షాపుల్లో దాడులు నిర్వహించి 15 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సివిల్ సప్లయ్ అధికారి నిత్యానందం ఆదేశాల మేరకు పౌరసరఫరాల సిబ్బంది, రెవెన్యూ అధికారులు చేగుంటలోని అక్రమ గ్యాస్ రీ ఫిల్లింగ్ కేంద్రాల్లో శనివారం దాడులు నిర్వహించారు. వంజరి రాజుకు చెందిన లక్ష్మినర్సింహస్వామి రిపేర్ షాపులో 7, సురేశ్కు చెందిన గంగా లైట్హౌజ్లో 2, మహేదర్కు చెందిన లక్ష్మినర్సింహ సీడ్ షాపులో 6, 1 కమర్షియల్ సిలిండర్ కలుపుకొని మొత్తం 15 డొమెస్టిక్ సిలిండర్లు, ఒక కమర్షియల్ సిలిండర్ను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి
నంగునూరు(సిద్దిపేట): పొలం దున్నుతున్న క్రమంలో ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఘణపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బత్తుల బాపురాజు (39) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉదయం పొలం దున్నుతున్న క్రమంలో ఫిట్స్ రావడంతో కేజీవీల్ కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కుమారుడు సాయి చరణ్ ఫిర్యాదు మేరకు రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


