పుల్కల్(అందోల్): యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో మండల పరిధిలోని ముదిమాణిక్యం గ్రామంలో కలకలం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లికార్జునపల్లి రాజు(28) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నాడు. కాగా అతడ్ని గర్తుతెలియని కొందరు వ్యక్తులు ఫోన్ చేసి కారులో తీసుకెళ్లారు. ముదిమాణిక్యం– సూరెడ్డి ఇటిక్యాల గ్రామాల మధ్య రహదారి ప్రక్కన హత్య చేసి పడేశారు. సీసాతో గొంతు కోసి హత్య చేసిన ఆనవాళ్లు లభించాయని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య, జోగిపేట సీఐ అనిల్కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జాగిలాలు సంఘటన స్థలం నుంచి రహదారిపైకి వచ్చి ఆగిపోయాయి. క్లూస్ టీం సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతుని శవానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.కాగా మృతుడికి భార్య ఉంది. కాగా గ్రామంలోని సీసీ కెమెరాల్లో కారు ఆనవాళ్లు లభించాయని తెలిసింది.


