TS Medak Assembly Constituency: TS Election 2023 గీతారెడ్డి ఇంటికి రేవంత్‌రెడ్డి
Sakshi News home page

TS Election 2023: గీతారెడ్డి ఇంటికి రేవంత్‌రెడ్డి..

Aug 14 2023 6:22 AM | Updated on Aug 14 2023 11:29 AM

- - Sakshi

సంగారెడ్డి: నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే శనివారం రాత్రి చంద్రశేఖర్‌ బీజేపీకి రాజీనామా చేశారు. ఆదివారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌తో కలిసి చంద్రశేఖర్‌ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జహీరాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించడం చక చకా జరిగిపోయాయి.

తన తాత ముత్తాతలు, తల్లిదండ్రులు జహీరాబాద్‌ నియోజకవర్గంలోని రాజనెల్లి గ్రామానికి చెందిన వారని, భార్య స్వస్థలం జహీరాబాద్‌ కావడంతో తనకు కలిసివస్తుందని చంద్రశేఖర్‌ చెప్పుకొచ్చారు. ఈ నెల 18న కాంగ్రెస్‌లో అధికారికంగా చేరుతున్నట్లు ప్రకటించారు. జహీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సైతం చంద్రశేఖర్‌ పేరును ప్రతిపాదించినట్లు ప్రచారం సాగుతోంది.

గీతారెడ్డి ఇంటికి రేవంత్‌రెడ్డి..
మాజీ మంత్రి, జహీరాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇన్‌చార్జి జె.గీతారెడ్డిని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం రాత్రి ఎంపీపీ అధ్యక్షుడు ఎన్‌.గిరిధర్‌రెడ్డితో కలిసి ఆమె నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితుల కారణంగా గీతారెడ్డి ఎన్నికల్లో పోటీచేసే విషయంలో సుముఖంగా లేనట్లు తెలిసింది.

దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవి, లేదా రాజ్యసభ సీటు ఇవ్వాలనే దానిపై ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. తన స్థానంలో అధిష్టానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా అభ్యంతరం లేదని, గెలిచే అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని గీతారెడ్డి సూచించినట్లు వినికిడి. ఈ సందర్భంగా వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ పేరు ప్రస్తావనకు రాగా ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement