సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులకే ప్రస్తుత ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏ చట్టం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలా ఉండాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. క్రెడిట్ చోరీలో చంద్రబాబు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు. జేఎస్డ్ల్యూ స్టీల్ ప్లాంట్ కోసం 2022లోనే అన్ని అనుమతులు, రాయితీలు, నీటి సదుపాయం, రైల్వే కనెక్టివిటీ వంటి పనులు పూర్తయ్యాయి. అధికారం వచ్చి రెండేళ్లు గడిచినా వైఎస్ జగన్ తీసుకొచ్చిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు. మేము తీసుకొచ్చిన పరిశ్రమలకే శంకుస్థాపన చేస్తే మీరు ఎప్పుడు పరిశ్రమలు తీసుకొస్తారు. ఉద్యోగాల కల్పన ఎప్పుడు చేస్తారు. జేఎస్డ్ల్యూకి కావాల్సిన అన్ని అనుమతులు రాయితీలకు జీవో ఇచ్చాం. సంస్థ ప్రారంభ సమయంలో ప్రభుత్వం మారింది.
జిందాల్ సంస్థ రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు తరలిపోయేలా చేశారు. ఒక యాక్టర్ను వాడుకొని జిందాల్ను ఇబ్బందులకు గురి చేశారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. అంతర్జాతీయ మేస్త్రి సంగం అధ్యక్షుడు చంద్రబాబు. ఎటువంటి అనుమతులు, భూమి లేకుండా 2019లో చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేశారు. రెండు సంవత్సరాలు పూర్తిగా వదిలేసి ఇప్పుడు మళ్ళీ తెరపైకి జేఎస్డ్ల్యూ స్టీల్ను తీసుకొచ్చారు. చంద్రబాబు శిలాఫలకాల ఏర్పాటుకు పెట్టింది పేరు. వేదిక ఏదైనా వైఎస్సార్సీపీని తిట్టడమే చంద్రబాబు లక్ష్యం. ప్రపంచ వేదిక అయినా జగన్నామస్మరణ చేస్తున్నారు..
నా మాటలపై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఏ సైకో చెప్పాడని చింతమనేని మా ప్రభుత్వంలో మంత్రిని అలా అన్నాడు. బాలకృష్ణ మహిళల కోసం ఏ సైకో గాడు చెప్తే మాట్లాడారు. కృష్ణ జిల్లాలో మహిళా ప్రజా ప్రతినిధిపై దాడి చేయమని ఏ సైకో చెప్పాడు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని అన్న సైకో ఎవడో అందరికీ తెలుసు. మహిళల పుట్టుక కోసం తప్పుగా మాట్లాడిన సైకోగాడు ఎవరో అందరికీ తెలుసు. టీడీపీ బీఎల్ఏలు ఓటర్ల ఇంటికి వెళ్తే ప్రజలు వారిని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల నుంచి టీడీపీ బీఎల్ఓలు ఎన్యూమరేషన్కు వెళ్లడం లేదు. వెన్నుపోటు, ద్రోహనికి ఈ దేశంలో పేటెంట్ చంద్రబాబు. పిల్లనిచ్చిన మామకి, జన్మనిచ్చిన సీమకి.. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి బాబు..
కోవిడ్ ఉన్నా.. మా ప్రభుత్వంలో మంచి ఆదాయాలు వచ్చాయి. మొదట సంవత్సరం ఈ ప్రభుత్వానికి మైనస్ మార్కులు వచ్చాయి. చదువు కొనుక్కోవచ్చు కాబట్టి లోకేష్ విదేశాల్లో చదివారు. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉండి కులాల కోసం మాట్లాడవచ్చా. చంద్రబాబు క్రెడిట్ చోరీ మానుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏ చట్టం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలా ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు. మంత్రులు వారి శాఖల కోసం తప్ప మిగిలిన అన్ని శాఖల కోసం మాట్లాడుతారు. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి వర్గం అట్టర్ ఫెయిల్యూర్.. రాష్ట్ర చరిత్రలో ఇది ఫెయిల్యూర్ క్యాబినెట్ అని విమర్శించారు.


