ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబూ?: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Tweet On Sand Exploitation In Chandrababu Government | Sakshi
Sakshi News home page

ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబూ?: వైఎస్‌ జగన్‌

Oct 13 2024 8:46 PM | Updated on Oct 13 2024 9:26 PM

Ys Jagan Tweet On Sand Exploitation In Chandrababu Government

పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట.

చంద్రబాబు సర్కార్‌ ఇసుక దోపిడీపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

ఇసుక​ దోపిడీ వ్యవహారంలో దొంగే దొంగ అన్నట్లుగా బాబు తీరు

గత ప్రభుత్వంపై నిందలు వేసి.. చంద్రబాబు అబద్ధాలు

ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చేస్తున్నదేంటి?

రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత ఇసుక లభిస్తోందా?

ఎన్నికల్లో ఉచిత ఇసుక ఇస్తామంటూ ఊరూరా డప్పు

ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా?

సాక్షి, తాడేపల్లి: పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు మోడస్‌ ఆపరండీకూడా అలాగే ఉందంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చురకలు అంటించారు.

 రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? 
‘‘గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి? అందుకే ఆయన్నే అడుగుతున్నా రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అసలు ఇసుక‌ కొందామంటేనే మా ప్రభుత్వంలోకన్నా రేటు రెండింతలు ఉంది. ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అధికార దుర్వినియోగంతో ఇసుకచుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నలు గుప్పించారు.

ఇది నిజం కాదా?
‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా? వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవకముందే ఎక్కడకు పోయింది? ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీల నేతలు దోచేయలేదా? కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజం కాదా?’’ అని ఎక్స్‌ వేదికగా నిలదీశారు.

ఇదీ చదవండి: ఉచిత ఇసుకకు ‘టెండర్‌’!

మోడస్‌ ఆపరండీకి సృష్టికర్త మీరే కదా చంద్రబాబూ..
‘‘2014-19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్లీ ఇప్పుడు పునరావృతం అయ్యిందన్నది వాస్తవం కాదా? ఈ మోడస్‌ ఆపరండీకి సృష్టికర్త, మూలపురుషుడు మీరే కదా చంద్రబాబూ.. ఆ రోజుల్లో ఇసుక బాధ్యతలను  మొదట ఏపీఎండీసీకి అప్పగించారు, ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్‌ ఇచ్చారు, 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దుచేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు, చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా మీ మనుషులకు అప్పగించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు.  ఈ నది, ఆ నది అని లేకుండా ప్రతిచోటా ఇసుకను కొల్లగొట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు.

 పేరుకు ఉచితం అంటున్నారంతే.. 
..ఇప్పుడు కూడా జరుగుతున్నది సేమ్‌ టు సేమ్‌. అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదు. పేరుకు ఉచితం అంటున్నారంతే.. మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబు, ఆయన ముఠా వల్ల, ముఠాకొరకు, ముఠా చేతులమీదుగా నడుస్తోంది. పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే, దొంగచాటుగా టెండర్లు పిలవడం నిజం కాదా చంద్రబాబు? దేశంలో ఎక్కడా చూడని విధంగా ఉద్దేశపూర్వకంగా కేవలం 2 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది మీ స్వార్థం కోసం కాదా? ఎవ్వరినీ టెండర్లలో పాల్గొనకుండా దౌర్జన్యాలకు పాల్పడిన మాట వాస్తవం కాదా?’’ అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఇసుక విధానం
‘‘అదే గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేసింది. దోపిడీలకు అడ్డుకట్టవేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందించింది. అత్యంత పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్‌ఫాం మీద ఇ-టెండర్లు నిర్వహించింది. రీచ్‌ల వద్ద ఆపరేషన్‌ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరాచేసింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చేసింది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుకరేట్లను ప్రకటించింది.

 

ప్రజలకూ ఉచితంగా అందడంలేదన్నది నిజం కాదా?
 ..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చింది. ప్రజలకు తక్కువ ధరకు ఒకవైపు ఇస్తూ మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేసింది. రేట్లపై సెబ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకుంది. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేసింది. మరి మీ హయాంలో ప్రభుత్వానికి ఒక్క రూపాయి రావడంలేదన్నది వాస్తవం కాదా? ప్రజలకూ ఉచితంగా అందడంలేదన్నది నిజం కాదా? ఇసుక ఉచితమే అయితే వైఎస్సార్‌సీపీ హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి? మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబు?’’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు. 

ఇదీ చదవండి: సిండికేట్‌ కైవశం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement