రాజకీయాలకు గుడ్‌బై!  | Why Lalu Yadav's Daughter Rohini Acharya Quits Politics And Cuts Ties With Family, Know What She Said | Sakshi
Sakshi News home page

రాజకీయాలకు గుడ్‌బై! 

Nov 15 2025 4:21 PM | Updated on Nov 16 2025 4:16 AM

Why Lalu Yadavs Daughter Rohini Acharya Quits Politics What She Said

నా కుటుంబంతో సంబంధాలు తెంచుకుంటున్నా 

లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ప్రకటన 

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణీ ఆచార్య ప్రకటించారు. అంతేకాదు, తమ కుటుంబంతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు కూడా ఆమె స్పష్టం చేశారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలవడం తెల్సిందే. 

ఈ నేపథ్యంలో రోహిణి చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘నా సోదరుడు తేజస్వీ యాదవ్‌ సన్నిహితులు సంజయ్‌ యాదవ్, రమీజ్‌ ఆలం సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. తప్పంతా నాపైనే వేసుకుంటున్నా’అని ఆమె శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. వృత్తిరీత్యా వైద్యురాలైన రోహిణి, లాలు సారథ్యంలోని ఆర్జేడీలో గతంలో క్రియాశీలకంగా ఉన్నారు. 
 

లాలూ తనయ అయిన రోహిణి ఆచార్య డాక్టర్‌ కూడా. తన భర్త, పిల్లలతో సింగపూర్‌లో ఆమె స్థిరపడ్డారు. 2022లో తండ్రి లాలూకి తన కిడ్నీ దానం చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.  ఆ సమయంలో అదంతా డ్రామా అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయితే దానిని నిరూపించాలంటూ విమర్శకులకు ఆమె ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె సరన్‌ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ చేతిలో ఓడారు.

ఆ ఓటమి తర్వాత కూడా ఆమె రాజకీయంగా క్రియాశీలకంగానే వ్యవహరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగపూర్‌ నుంచి వచ్చి మరీ ఆమె సోదరుడు తేజస్వీ యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హర్యానాకు చెందిన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ యాదవ్‌తో ఆమెకు విబేధాలు మొదలయ్యాయి. తన సోదరుడిని, తనను సైతం పక్కన పెడుతూ పార్టీ వ్యవహారాల్లో సంజయ్‌ అతిజోక్యం చేసుకోవడాన్ని ఆమె భరించలేకపోయారు. ఓటర్‌ అధికార్‌ యాత్రలోనూ సంజయ్‌ వ్యవహార శైలిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆ సమయంలో తేజస్వి సోదరికి మద్ధతుగా నిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. 

2024 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని సరన్‌ నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందే ఈమె ఎక్స్‌లో తండ్రి లాలూ, సోదరుడు తేజస్వీ యాదవ్‌లను అన్‌ఫాలో చేశారు. మరో సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు, కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు లాలూ ప్రకటించడం తెల్సిందే. భార్యతో విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగా ఓ మహిళతో అతడు సంబంధం నడుపుతుండటం లాలూకు నచ్చలేదు. అయితే, ఈ నిర్ణయంపై రోహిణి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. 

ఇటీవలి ఎన్నికల్లో సొంతంగా పార్టీ ప్రకటించిన తేజ్‌ ప్రతాప్‌.. పార్టీ అభ్యర్థులను కూడా బరిలోకి దించారు. కానీ, స్వయంగా ఓటమి పాలైన తేజ్‌ ప్రతాప్, ఏ ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయారు. ఈ పరిణామాల నడుమ శనివారం ఆమె ఈ మేరకు ఎక్స్‌లో పోస్టులు పెట్టినట్లుగా భావిస్తున్నారు. కుటుంబంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కినట్లుగా చెబుతున్నారు. తండ్రి లాలూకు రోహిణి 2022లో తన కిడ్నీని దానం చేశారు. రోహిణి వాస్తవానికి కిడ్నీ దానం చేయలేదనే పుకార్లు, ఆరోపణలే ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement