పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణిగా నందినీ చక్రవర్తి(Nandini Chakravorty) ఘనత సాధించారు. ఆమె బుధవారమే బాధ్యతలు స్వీకరించారు. ఆమె నిన్నటివరకు హోం, హిల్ అఫైర్స్ విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1994 బ్యాచ్కి చెందిన నందినీ చక్రవర్తి తన మూడు దశాబ్దాల కెరీర్లో అనేక కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆమె కథక్ డ్యానర్స్ కూడా. ఎంతో మంది సీనియర్లను వెనక్కినెట్టి రాష్ట్ర బ్యూరోక్రసీలో కీలక పదవిని ఆమె ఎలా అధిరోహించారు, ఆమె విద్యా నేపథ్యం ఏంటి వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.
ప్రస్తుత ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ బుధవారంతో పదవీ విరమణ పొందారు. వాస్తవానికి ఆయన గత జూన్లోనే రిటైర్ కావాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు కేంద్రం ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నియామకాల్లో కేంద్ర నిబంధనలను పక్కన పెడుతోందన్న ఆరోపణ నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎవరీమె..
కోల్కతాలోని లేడీ బ్రాబోర్న్ కళాశాల పూర్వ విద్యార్థిని అయిన చక్రవర్తి, రాంచీలోని సేక్రేడ్ హార్ట్ పాఠశాలలో తన పాఠశాల విద్యను అభ్యసించారు. ఆమె 1993లో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసి, అదే సంవత్సరం యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
ఎన్నికలు సమీపించనున్న తరుణంలో పంత్ వారసుడిగా ఎవరిని నియమించాలన్నా ఊహగానాలకు అడ్డకట్టవేస్తూ..బెంగాల్ ప్రభుత్వం ఓ మహిళా ఐఏఎస్ అధికారికి బాధ్యతలను కట్టబెడుతూ..అందర్నీ విస్మయపరిచింది. ఈమె తనకుంటే సీనియర్లు ఉన్న ఐదు బ్యాచ్లలోని ఏడుగురు ఐఏఎస్ అధికారులను వెనక్కినెట్టి మరి ఈ అత్యునన్నత పదవిలో కొనసాగుతుండటం విశేషం.
వివాదాలకు కేరాఫ్ కూడా..
నందినీ చక్రవర్తి కెరీర్లో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గవర్నర్ సివి ఆనంద బోస్కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో రాజ్భవన్, రాష్ట్ర సచివాలయం (నబన్న) మధ్య జరిగిన ఘర్షణలో ఆమె పేరు వార్తల్లో నిలిచింది. అప్పట్లో ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని గవర్నర్ కోరినప్పటికీ, ప్రభుత్వం తొలుత నిరాకరించి, ఆ తర్వాత పర్యాటక శాఖకు బదిలీ చేసింది.
అయితే 2026 పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనుభవజ్ఞురాలైన నందినీ చక్రవర్తిని ఈ పదవిలో నియమించి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని మమతా బెనర్జీ ప్రభుత్వం యోచిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏదీఏమైన విధుల్లో చేదు అనుభవాలు, వివాదాలు..నెగిటివిటిని తెచ్చిపెడతాయన్నది అపోహేనని, అవి ఒక్కోసారి మన సామర్థ్యానికి, నిజాయితీకి దర్పణాలవుతాయని అందుకు ఈ ఐఏఎస్ అధికారిణి నందని చక్రవర్తి కేరీర్నే ఉదాహరణ.
(చదవండి: ఆ గ్రామం న్యూ ఇయర్కి ఎలా స్వాగతం పలుకుతోందంటే..?)


