నా ఓటమికి సంతోషించేవాళ్లు దేశ ద్రోహులే: వినేశ్‌ ఫోగట్‌ | Vinesh Phogat slams bjp leaders Those happy over my loss should be tried sedition | Sakshi
Sakshi News home page

నా ఓటమికి సంతోషించేవాళ్లు దేశ ద్రోహులే: వినేశ్‌ ఫోగట్‌

Sep 8 2024 8:00 PM | Updated on Sep 8 2024 9:37 PM

Vinesh Phogat slams bjp leaders Those happy over my loss should be tried sedition

చంఢీఘఢ్‌: ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో తనకు పతకం చేజారినందుకు బీజేపీ నేతలు సంతోషపడ్డారని ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ అన్నారు. ఇలా దేశంపై అగౌరవం ప్రదర్శించేవారు దేశద్రోహానికి ప్రయత్నం చేసినట్లేనని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ తరఫున తాను పోటీ చేసే స్థానం జులానాలోలో ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ ర్యాలీలో పాల్గొన్న ఆమె..తనపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు.

‘‘గత ఏడాదిన్నర నుంచి బీజేపీ నేతల నుంచి తీవ్రమైన వ్యాఖ్యలు, విమర్శలను వింటూనే ఉన్నాం. ఆ వ్యాఖ్యలు వారి మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. నేను ప్యారిస్ ఒలింపిక్స్‌ పతకం కోల్పోవటం సంతోషంగా ఉందని చెబుతున్నారు. అంటేవారు దేశద్రోహానికి పాల్పడినట్లే. నేను గెలిచే మెడల్‌ నా కోసం కాదు. దేశం మొత్తానికి చెందినది. బీజేపీ నేతలు దేశం మొత్తాన్ని అగౌరవపరిచారు.

..నేను ప్యారిస్‌ నుంచి తిరిగి వచ్చాక పెద్ద రోడ్డు షో నిర్వహించారు. అందులో ఒక్కరు కూడా బీజేపీ చెందినవాళ్లు లేరు. రాష్ట్రంలో బీజేపీ సీఎం, డిప్యూటీ సీఎం ఉన్నారు. కానీ ఎవరూ నాకు మద్దతుగా నిలబడలేదు. సోషల్‌ మీడియాలో మాత్రం మనీ రివార్డులను ప్రకటించారు. వారు కేవలం ఓట్ల కోసమే చేశారు’అని అన్నారు.  

బీజేపీ నేత అనిల్ విజ్‌ చేసిన  వ్యాఖ్యపై  ఆమె స్పందిస్తూ.. తాను దేశానికి పుత్రికను.. ఎల్లప్పుడు నేను అలాగే ఉంటానని కౌంటర్‌ ఇచ్చారు. ఆయన ఇటీవల వినేశ్‌ను కాంగ్రెస్‌ పుత్రిక అని విమర్శించారు. ఇక.. వినేశ్‌, భజరంగ్‌ పూనియాలో కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ  బ్రిజ్‌ భూషన్‌ విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. తనపై లైంగిక ఆరోపణలు చేస్తూ.. రెజ్లర్లు చేపట్టిన ఆందోళన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. వినేశ్‌ ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకే దేవుడు పతకం చేజారేలా చేశాడని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement