ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది  | Telangana Assembly Elections Harish Rao Comments On SC Classification | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది 

Nov 6 2023 3:26 AM | Updated on Nov 6 2023 3:26 AM

Telangana Assembly Elections Harish Rao Comments On SC Classification - Sakshi

యుద్ధభేరి సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు 

కవాడిగూడ (హైదరాబాద్‌): ఎస్సీవర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఎంఆర్‌పీఎస్‌ (టీఎస్‌) ఆధ్వర్యంలో ఆర్థిక, రాజకీయ రంగాలలో మాదిగలకు సమానవాటా కోసం డిమాండ్‌ చేస్తూ ధర్నా చౌక్‌ వద్ద cను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ, ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 దళిత స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేశామని, 50 మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

హైదరాబాద్‌లో సదాలక్ష్మి విగ్రహం ఏర్పాటు చేసి, మాదిగ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య, ఆరోగ్య శాఖలోని శానిటేషన్, డైట్‌ విభాగాలలో దళితులకే కాంట్రాక్ట్‌ కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. వంగపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌(టీఎస్‌) జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సువర్ణరాజు, మాదిగ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్, ఎంఆర్‌పీఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement