మధు పార్క్లో అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడుతున్నమాజీ మంత్రి హరీశ్రావు
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు డీపీఆర్, ఎఫ్టీఎల్ అనుమతులు లేవు
ఏ చట్టం ప్రకారం ఇళ్లు ఖాళీ చేయమని నోటీసులు ఇస్తున్నారో అర్థం కావడం లేదు
మధు పార్క్ అపార్ట్మెంట్కు ఇచ్చిన నోటీసులు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసే ప్రతి పనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుందని, ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలు ఉంటాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమ ర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుందామని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, ఎల్టీపీఎస్ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యా పారం చేయాలని కూడా ఆలోచన చేశారన్నారు.
ఫార్మా సిటీ కోసం కేసీఆర్ 14 వేల ఎకరాలు సేకరిస్తే.. దాన్ని ఫోర్త్ సిటీ అని పేరుమార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా రన్నా రు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట ఇళ్లు కూల్చి, భూ ములు లాక్కొని.. వాటిని అంబానీకో, అదానీకో కట్టబెట్టా లని చూస్తున్నారని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రా జెక్టుతో ఇళ్లు కోల్పోతున్న మధుపార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులు ఆదివారం పరామర్శించారు.
ఈ ప్రభుత్వానికి ఓ విధానం లేదు..
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ కేసీఆర్ ఈ అపార్ట్మెంట్కు మూడుసార్లు వచ్చారని, పార్టీ పాలసీ విజన్ డాక్యుమెంట్ను ఇక్కడి వార్ రూముల్లో కూర్చునే తయారు చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, ఒక విధానం లేదని, పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఎవరి జేబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. మూసీ శుద్ధికి తాము వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరిట పేదల ఇళ్లు కూల్చడాన్ని మాత్రమే మేం వ్యతిరేకిస్తున్నామన్నారు. బాపు ఘాట్ వద్ద అహింసా మూర్తి గాంధీ విగ్రహం పెట్టి ఆరాధించాలని, ఆ విగ్రహం, నిర్మాణం పేరిట ప్రజల ఇళ్లు కూల్చుతూ, హింసా మార్గంలో భయాందోళనలకు గురిచేయడం దుర్మార్గం అని అన్నారు.
ఇళ్లు ఖాళీ చేస్తారా, లేక జేసీబీ పంపి కూల్చమంటారా అని అధికారులు బెదిరిస్తున్నారని, రేవంత్రెడ్డికి ఈ అపార్ట్మెంట్ అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమే కావచ్చు.. కానీ ఒక మధ్యతరగతి వాడికి రెక్కలు ముక్కలు చేసుకుని, బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు తెచ్చుకుని కట్టుకున్న జీవితకాలపు సొంతింటి కల అని హరీశ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు మూసీ ప్రాజెక్టుకు అసలు డీపీఆర్ లేదని, ఎఫ్టీఎల్ ఫిక్స్ కాలేదని, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదని, కనీసం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా జరగలేదని, అలాంటప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని నిలదీశారు.


