విశాఖ బెస్ట్.. అమరావతి వేస్ట్: తేల్చి చెప్పేసిన బాలయ్య చిన్నల్లుడు | TDP MP Candidate Sribharat Says Visakhaptnam Is Best For Capital | Sakshi
Sakshi News home page

విశాఖ బెస్ట్.. అమరావతి వేస్ట్: తేల్చి చెప్పేసిన బాలయ్య చిన్నల్లుడు

May 9 2024 7:01 PM | Updated on May 9 2024 7:39 PM

TDP MP Candidate Sribharat Says Visakhaptnam Is Best For Capital

అదేంటి అలాగనేశాడు.. ఒసే.. అలా చెప్పడమేటి? పళ్ళకుండూ.. ఇలాపింటి మాటలే దెబ్బేసేస్తాయి. నిజాలు అయినా.. అలా ఒప్పేసుకోకూడదు. ఆ.. ఎలచ్చన్లు అంటే ఏటనున్నావ్‌ మనకు ఏది లాభమో అదే చెప్పాలి. పక్కోడు మంచోడు అయినా మంచి చేసినా మనం ఒప్పుకోకూడదు. కానీ బాలయ్య చిన్నల్లుడు మాత్రం నిజం ఒప్పేసుకున్నాడు.. అంటూ కంచరపాలెం టీ  కొట్టు దగ్గర చెప్పుకెళ్తున్నాడు  సిమాచలం. 

ఒరే ఏట్రా బాబు.. అలా ఒక్కడివే పేలుకుంటున్నావ్ అన్నాడు నారాయణ బీడీ అంటిస్తూ, మరేట్రా బాలయ్య చిన్నల్లుడు.. ఇసాపట్నం టీడీపీ ఎంపీ కేండేట్ శ్రీభరత్ మొత్తానికి నిజం ఒప్పేసుకున్నాడు. జగన్ చేసిందే కరెస్ట్ అని చెప్పేసాడు అన్నాడు సిమాచలం. ఒరేయ్.. అసలు పాయింట్ చెప్పకుండా ఏదేదో పేల్తే గూబ పేలిపోద్ది అన్నాడు సిరగ్గా నారాయణ..

మనకు రాజధానిగా ఇసాపట్నమే బెస్టని, పొలాలు తుప్పలు డొంకలతో విలేజిల్లో ఉన్న అమరావతి వేస్ట్ అని చెప్పేశాడ్రా బాబు అన్నాడు సిమాచలం. ఒసే.. తెలుగుదేశపోల్లు అమరావతి అంటారు కదేటి.. ఉన్నఫళంగా ఇలాగనేశాడేటి అన్నాడు నారాయణ. ఒరేయ్.. వాళ్లకూ తెలుసురా అమరావతి అయ్యేది కాదని, ఎప్పటికైనా ఇసాపట్నమే ఆంధ్రకు పెద్ద దిక్కు అని. అందుకే ఆళ్ళ కాలేజీ కూడా ఇక్కడే డెవలప్ చేస్తున్నాడు

చూసావా అన్నాడు సిమాచలం. అవునురోయ్ మన ఇసాపట్నానికి అమరావతికి సాపత్తిమా, పల్లకోరా బాబు.. ఆ ముక్క తెలుగుదేశపోళ్ళకు కూడా తెలుసు. కానీ చంద్రబాబుకు అన్నీ మూసుకున్నారు. ఏదైనా జగన్ గొప్పోడురా బాబు అందుకే మన వైజాగ్‌ను రాజధానిగా చేయడమే కాదు ఇక్కడే పెద్దపెద్ద కంపెనీలు తెస్తాను అని అప్పుడే డిసైడ్ అయ్యాడు. చూస్తుండు అన్నీ ఖచ్చితంగా చేస్తాడు అని చెబుతున్న సిమాచలం వైపు విస్మయంతో చూస్తూ... పోన్లేరా అలాగైతే మన గుంతలకు ఇక్కడే ఉజ్జోగాలు వస్తాయి అన్నాడు నారాయణ.

టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం కాలేజీ చైర్మన్ శ్రీభరత్ మనసులోని మాట చెప్పేశారు. రాష్ట్ర రాజధానిగా విశాఖ అద్భుతంగా ఉంటుందని, ఈ నగరానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయ్ కాబట్టి  దేన్నిమించిన నగరం రాజధానిగా ఎంపిక చేసుకోలేమని తేల్చి చెప్పేశారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమరావతి అనేది రాజధానిగా పనికిరాదని, విశాఖ అద్భుతంగా అభివృద్ధి చెందిన నగరమని, అందుకే దీన్నే రాజధానిగా చేయాలనీ అన్నారు. అయన ఇప్పుడు చెబుతున్నారు కానీ సీఎం వైఎస్ జగన్ ఏనాడో విశాఖను రాజధానిగా చేస్తానన్నారు.

అయన రేపు ప్రమాణస్వీకారం కూడా విశాఖలోనే అని తేల్చేశారు.  ఇక శ్రీ భారత్ మామ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా విశాఖలో భీమిలి ప్రాంతంలో భూములు కొన్నట్లు తెలుస్తోంది. అంటే ఆయనకు కూడా విశాఖ రాజధాని అవుతుందని తెలుసు. కానీ చంద్రబాబు మాత్రమే తన తాబేదారులకోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులకోసం అమరావతి కావాలని అంటున్నారని ప్రజలు గుర్తించారు. ఇక ఎన్నికల ఫలితాలు రావడం, జగన్ గెలవడం.. విశాఖలోనే ప్రమాణస్వీకారం చేయడం, అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవడం చకచకా జరిగిపోతాయని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.
-సిమ్మాదిరప్పన్న 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement