ఉద్ధవ్‌ ఠాక్రేకు రాహుల్‌ గాంధీ ఫోన్‌.. సీట్ల పంపకంపై చర్చ! | Rahul Gandhi Phone Call With Uddhav Thackeray Amid Seats Row | Sakshi
Sakshi News home page

ఉద్ధవ్‌ ఠాక్రేకు రాహుల్‌ గాంధీ ఫోన్‌.. సీట్ల పంపకంపై చర్చ!

Feb 23 2024 12:12 PM | Updated on Feb 23 2024 12:23 PM

Rahul Gandhi Phone Call With Uddhav Thackeray Amid Seats Row - Sakshi

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ, శివసేన (యూబీటీ) మధ్య సీట్ల పంపకంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌  గాంధీ సీట్ల పంపకంపై మాట్లాడినట్లు సమాచారం.

ముంబై: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీట్ల పంపకం కసరత్తు విషయంలో వేగం పెంచుతోంది. ఈ క్రమంలో శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ  ఫోన్‌ చేసిన సుమారు గంటసేపు మాట్లడినట్లు తెలుస్తోంది. భారత్‌ జోడో న్యాయ యాత్రలో ఉ‍న్న రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా ఉద్ధవ్‌ ఠాక్రేకు ఫోన్‌ మాట్లాడటంపై ఇరు పార్టీల్లో సీట్ల పంపంకంపై చర్చ జరుగుతోంది. 

కాంగ్రెస్‌ పార్టీ ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో.. ముంబై సౌత్‌  సెంట్రల్‌, ముంబై నార్త్‌ సెంట్రల్‌, ముంబై నార్త్‌ వెస్త్‌ సగ్మెంట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఉద్ధవ్‌ ఠాక్రే ముంబై సౌత్‌, ముంబై నార్త్‌ వెస్ట్, ముంబై నార్త్‌ ఈస్ట్‌, ముంబై  సౌత్‌ సెంట్రల్‌ సీట్లను కలుపుకొని మొత్తం 18 లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ సీట్ల సర్దుబాటు ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ, శివసేన (యూబీటీ) మధ్య సీట్ల పంపకంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌  గాంధీ సీట్ల పంపకంపై మాట్లాడినట్లు సమాచారం. మహారాష్ట్రలోని 48 సీట్లలో 8 సీట్ల విషయంలో ఉన్న ప్రతిష్టంభనపై స్పష్టత  ఇవ్వడానికి రాహుల్‌ గాంధీ ఉద్ధవ్‌కు కాల్‌ చేసినట్లు తెలుస్తోంది. 

ఉమ్మడి శివసేన గత 2019లో పార్లమెంట్‌ ఎన్నికల్లో 48 సీట్లకు గాను 22 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక.. శివసేనలో చీలిక వచ్చి కొంత మం‍ది ముఖ్యనేతలు ఏక్‌నాథ్‌షిండే వర్గంలో ఉండి బీజేపీలో చేరారు. అదే విధంగా మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఎన్సీపీలో సైతం చీలికలు వచ్చి అజిత్‌ పవార్‌ వర్గం బీజేపీలో చేరింది. మరోవైపు ఇటీవల మహారాష్ట్రలో  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు అశోక్‌ చవాన్‌, మిలింద్‌ దేవరా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ శివసేనతో సీట్ల పంపకం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్‌ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్‌తో సీట్ల పంపకం ఓ  కొలిక్కి  వచ్చిన నేపథ్యంలో ఠాక్రేకు  రాహుల్‌ కాల్‌ చేయటం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement