‘రాష్ట్రంలో శత్రువులు.. ఢిల్లీలో చెట్టాపట్టాలు! | PM Modi Slams Congress-Left: 'Lathi In Kerala, Chai Samosa In Delhi' | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రంలో శత్రువులు.. ఢిల్లీలో చెట్టాపట్టాలు!

Feb 27 2024 5:11 PM | Updated on Feb 27 2024 5:27 PM

PM Modi slams Congress Left  Lathi in Kerala chai samosa delhi - Sakshi

తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడూ విడిపోని ప్రాణ స్నేహితులని కానీ కేరళ మాత్రం బద్దశత్రువులని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ యాత్ర ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

‘కేరళలో కాంగ్రెస్‌ పార్టీ, లెఫ్ట్‌ పార్టీలు ఒకరికొకరు శత్రువులు. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ప్రాణ స్నేహితులు. ఈ పార్టీలు తిరువనంతపురం భిన్నమైన భాష మాట్లాడి.. ఢిల్లీలో మాత్రం ఒకే భాష మాట్లాడుతాయి’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. మరోవైపు కేరళలో కాంగ్రెస్‌ పార్టీ సీపీఐ(ఎం) ప్రత్యర్థులు.. అదే పశ్చిమ బెంగాల్‌లో మాత్రం మళ్లీ మిత్రపక్షాలు. ఇటువంటి వైరుధ్యాలు కలిగిఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఢిల్లీ, గుజరాత్‌, గోవాల్లో సీట్లు సర్దుబాటు చేసుకుందని దుయ్యబట్టారు. 

‘కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ అవినీతిపరుడు. కేరళలో గత కమ్యూనిస్ట్‌ పార్టీ పాలకులు కాంగ్రెస్‌ కార్యకర్తలపై లాఠీ చార్జీలు చేశారు. కమ్యూనిస్ట్‌ నేత పలు కుంభకోణాలకు పాల్పడ్డారు. కానీ.. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లో మాత్రం ఇరుపార్టీ నేతలు ఢిల్లీలో కూర్చొని బిస్కెట్లు, సమోసాలు తింటూ చాయ్‌ తాగుతారు’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు.

కేరళలో ఒకటి చెప్పి.. ఢిల్లీలో మరోటి చెప్పి ద్రోహం చేసేవారికి (కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేరళ ప్రజలు తగినబుద్ధి చెప్పాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేరళలో బీజేపీకి డబుల్‌ డిజిట్‌ సీట్లు ఇవ్వాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. కేంద్ర పథకాలతో కేరళ లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో 20 సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ 15 సీట్లను గెలుచుకోగా.. బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement