నీలాగా వెన్నుపోటు పొడిచానా?.. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌ | Peddireddy Ramachandra Reddy Serious On Chandrababu | Sakshi
Sakshi News home page

నీలాగా వెన్నుపోటు పొడిచానా?.. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

Jan 28 2024 2:35 PM | Updated on Feb 5 2024 12:28 PM

Peddireddy Ramachandra Reddy Serious On Chandrababu - Sakshi

సాక్షి, పుంగనూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కనీసం కుప్పంలో కూడా చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు అంటూ ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక చౌకబారు విమర్శలకు దిగారంటూ సీరియస్ కామెంట్స్‌ చేశారు. 

కాగా, మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం పుంగనూరులో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు మితిమీరి నాపై విమర్శలు చేస్తున్నాడు. నీ లాగా నేను మామకు వెన్నుపోటు పొడిచానా?. చంద్రబాబు నువ్వు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కనీసం కుప్పంలో కూడా గెలవలేవు. కుప్పంకు మేము నీళ్లు ఇస్తున్నాం. కానీ, నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశావ్‌?. ఓటమి భయంతో రాజకీయంగా ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 

సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని చంద్రబాబు విమర్శించారు. ఈరోజు బాబు షూరిటీ.. భవిషత్తు గ్యారంటీ అంటున్నారు. గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దింపగానే మద్యపాన నిషేదం ఎత్తివేశారు, రెండు రూపాయల కిలో బియ్యం తీసేశారు. 2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా?. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించారు. ఇన్నిసార్లు మోసం చేసిన చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలు కూడా చూడకుండా పథకాలు అందిస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీలు పెట్టీ టీడీపీకి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చారు. పేదరికాన్ని కొలబద్దగా తీసుకుని ప్రజలకు అండగా నిలిచింది సీఎం జగన్ మాత్రమే. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పథకాల అమలుపై సీఎం జగన్ దృష్టి సారించారు. చంద్రబాబు నాపై విమర్శలు చేస్తున్నారు. నేను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారు. చంద్రబాబు మోసకారి మాటలు నమ్మవద్దు.. అధికారంలోకి రాలేము అని దూషణలు మొదలు పెట్టారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు. నువ్వు వెన్నుపోటు పొడిచి జిల్లా మొత్తానికి చెడ్డపేరు తెచ్చావు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement