
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడం తన చేతుల్లో లేదని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ చేతులెత్తేశారు. తనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేనందున, తనకు ప్రధాని మోదీతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపే సత్తా లేదని తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కు కోసం తాను కేంద్రంతో గొడవ పెట్టుకోలేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీని ఒప్పిస్తే ఒప్పుకుంటారని, కానీ తనకు ఒక్క ఎంపీ కూడా లేరని, వైఎస్సార్సీపీ ఎంపీలు ఒప్పించడం లేదన్నారు. ఆంధ్ర ఎంపీలంటే ఢిల్లీలో చాలా చులకన అన్నారు.
ఆదివారం రాత్రి గాజువాకలో జరిగిన వారాహి విజయయాత్ర బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. జనసేన పార్టీ నడపడానికే సినిమాలు ఇంధనం వంటివని, అందుకే తాను సినిమాల్లో నటిస్తున్నానని, పార్టీ నడపడానికి ఎవరైనా నిధులిస్తే తీసుకుంటానని చెప్పారు. తాను 25 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్ల వరకు సీఎం పదవిని ఆశించకూడదనుకున్నానన్నారు. ఇప్పుడు సీఎం పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే అది జనసేన నుంచా లేక మిశ్రమ ప్రభుత్వం నుంచా? అన్నది కాలానికే వదిలేస్తున్నట్టు తెలిపారు.
మరోసారి వైఎస్ జగన్ సీఎం కాకూడదన్నదే తన అభిమతంగా చెప్పారు. విశాఖ రుషికొండ భవిష్యత్తులో ఏదో ఒక రోజు జగన్తో సహా భూమిలోకి కూరుకుపోతుందన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గతంలో రౌడీషీటర్ అని చెప్పారు. ఆయన విశాఖ సిరిపురంలో నాలుగు అంతస్తులకే అనుమతి తీసుకుని 26 ఫ్లోర్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు.
తాము అధికారంలోకి వస్తే గుర్గావ్లో టవర్స్ మాదిరిగానే కూల్చేస్తామని, ఎంవీవీపై మళ్లీ రౌడీషీట్ తెరుస్తామన్నారు. విశాఖ పెదజాలరిపేటలో రూ.2 వేల కోట్ల టీడీఆర్ కుంభకోణం జరిగిందన్నారు. రాష్ట్రం కోసం మంగళగిరికి మకాం మార్చానని, తాను విశాఖను రెండో ఇల్లుగా చేసుకుంటానని చెప్పారు. విప్లవకారుడు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు.